తెలంగాణ‌లో వేడెక్కిన స‌వాళ్ల రాజ‌కీయం!

తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా సాగుతున్న స‌వాళ్లు.. గురువారం రోడ్డెక్కాయి. మీ స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామంటూ.. బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నతో ప్ర‌భుత్వ ప‌రంగా కూడా అంతే దీటుగా స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు ముందుగానే గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. అయితే.. మ‌రో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద‌కే వ‌స్తున్నాన‌ని చెప్ప‌డంతో కేటీఆర్ అక్క‌డే తిష్జ వేశారు.

ఇక‌, గ‌న్ పార్క్ వ‌ద్ద మంత్రుల‌తో చ‌ర్చించేందుకు బ‌య‌లు దేరిన హ‌రీష్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య తోపులాట జ‌రిగి.. హ‌రీష్‌రావు కింద ప‌డిపోయారు. అనంత‌రం.. హ‌రీష్‌రావును నాట‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌రోవైపు.. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు మోహ రించారు. మంత్రి జూప‌ల్లికి అక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని తెలియ‌డంతో బీఆర్ ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి.

స‌వాళ్లు ఇవీ..

ఇటీవ‌ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అప్పుల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు బీఆర్ ఎస్ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. 60 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు మాత్ర‌మే ఉన్నాయ‌ని సీఎం చెబుతున్నారు. కానీ, కేసీఆర్ మ‌యాంలో ఏకంగా 8 ల‌ల కోట్ల‌కుపైగానే అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశార‌ని ఆరోపించారు. అదేవిధంగా విద్యార్థుల‌కు క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌లేద‌ని.. గురుకులాల‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టించార‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు విష‌యాల‌పై చ‌ర్చకు సిద్ధ‌మ‌ని.. మీరే అప్పులు చేస్తూ.. మాపై తోస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.త ఆము 3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే అప్పులు చేశామ‌ని, కానీ, తెలంగాణ నుంచి ప‌న్నులు వ‌సూలు చేసి ఢిల్లీ పెద్ద‌ల‌కు మోస్తున్నార‌ని ఎదురు దాడి చేశారు. అదేస‌మ‌యంలో గురుకులాల‌కు కూడా తాము అన్యాయం చేయ‌లేద‌ని, మెరుగైన వ‌స‌తులు క‌ల్పించామ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు చ‌ర్చ‌కు సిద్ధం కాగా.. ఉద్రిక్త‌త‌లు పెరిగి.. రాజ‌ధాని ప్రాంతంలో పోలీసులు మోహ‌రించారు.