అతడి కోసం ఎగ‌బ‌డి టికెట్లు కొంటే…

ఈ ఏడాది ఐపీఎల్ సంద‌ర్భంగా వైభ‌వ్ సూర్య‌వంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మ‌హా మ‌హా బ్యాట‌ర్ల‌ను వెన‌క్కి నెట్టి ఈ 15 ఏళ్ల కుర్రాడు ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. మెరుపు ఇన్నింగ్స్‌ల‌తో అభిమానుల‌ను ఉర్రూత‌లూగించాడు. ఈ సీజ‌న్లో ఐపీఎల్ టాప్ స్కోర‌ర్ అత‌నే. ఎంద‌రో మేటి బౌల‌ర్లను అత‌ను ఉతికారేసిన వైనాన్ని అభిమానులు అంత సులువుగా మ‌రిచిపోలేరు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో అత‌ను భార‌త క్రికెట్ జ‌ట్టులోనూ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు వైభ‌వ్‌కు భార‌త జ‌ట్టులో చోటిచ్చారు సెల‌క్ట‌ర్లు. శుక్ర‌వార‌మే ఐర్లాండ్‌తో తొలి టీ20 కావ‌డంతో.. ఈ రోజే వైభ‌వ్ అంత‌ర్జాతీయ అరంగేట్రం జ‌రుగుతుంద‌ని అంతా భావించారు. 15 ఏళ్ల 91 రోజుల వ‌య‌సులో టీ20 ఆడి.. అత్యంత పిన్న వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన భార‌త క్రికెట‌ర్‌గా స‌చిన్ టెండుల్క‌ర్ పేరిట ఉన్న రికార్డును వైభ‌వ్ బ‌ద్ద‌లు కొట్టేస్తాడ‌ని అంతా అనుకున్నారు.

కానీ తీరా చూస్తే ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభ‌వ్ ఆడ‌నే లేదు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్, కోచ్ గౌత‌మ్ గంభీర్ తొలి టీ20 నుంచి వైభ‌వ్‌ను ప‌క్క‌న పెట్టారు. రెగ్యుల‌ర్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్‌ల‌తోనే ఇన్నింగ్స్ మొద‌లుపెట్టించారు. వైభ‌వ్ ఈ మ్యాచ్‌లో ఆడ‌తాడ‌ని క్రికెట్ ఫ్యాన్స్ ఎగ‌బ‌డి టికెట్లు కొన్నారు.

ఐర్లాండ్‌లో ఉండే ఇండియ‌న్ ఫ్యాన్స్‌కు తోడు లోక‌ల్ టీం మ‌ద్ద‌తుదారుల‌తో స్టేడియం నిండిపోయింది. ఐర్లాండ్‌లో ఎప్పుడూ లేనంత వేగంగా ఈ మ్యాచ్ టికెట్లు శ‌ర‌వేగంగా సేల్ అయ్యాయ‌ట‌. ఇదంతా వైభ‌వ్ అరంగేట్రం, త‌న మెరుపుల‌ను చూడ‌డానికే. కానీ అత‌ణ్ని తుది జ‌ట్టులో ఆడించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు.

ఐతే 15 ఏళ్ల చిన్న కుర్రాడైన వైభ‌వ్‌ను ఎంపికైన తొలి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే తుది జ‌ట్టులో ఆడిస్తే ఒత్తిడికి గుర‌వుతాడ‌ని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించి ఉండొచ్చు. డ్రెస్సింగ్ రూం వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డ్డాక‌.. కొన్ని మ్యాచ్‌ల త‌ర్వాత అత‌ణ్ని ఆడిద్దాం అనుకుని ఉండొచ్చు. ఇప్పుడే జ‌ట్టులోకి వ‌చ్చిర‌ అత‌డి కోసం రెగ్యుల‌ర్ ఓపెన‌ర్ల‌లో ఒక‌రిని వెంటనే ప‌క్క‌న పెట్ట‌డం కూడా స‌రి కాద‌ని భావించారేమో. బ‌హుశా ఐర్లాండ్‌తో ఆదివారం జ‌రిగే రెండో టీ20 లేదంటే జులై 1 నుంచి జ‌రిగే ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభ‌వ్ అరంగేట్రం చూస్తామేమో.