కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ.. విద్యార్థులకు పాఠంగా మారనుంది. ఎన్ సీఆర్ టీ నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల్లో దీనిని ఒక విభాగంగా చేర్చనున్నారు. అయితే.. దీనిని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు ఎన్ సీ ఈఆర్టీ పేర్కొంది. సర్ ప్రక్రియను అత్యంత కీకలమైందిగా పేర్కొన్న ఎన్సీఆర్టీ.. దీనిపై భావితరాలకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
సర్ ప్రక్రియలో ఏం చేస్తారు? ప్రజలు ఏం చేయాలి? అనే ముఖ్యమైన అంశాలను కూడా ఈ పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం ద్వారా.. న్యాయమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని ఈ పాఠ్యాంశంలో పేర్కొన్నారు. అదేసమయంలో నకిలీ ఓటర్లు, దొంగ ఓట్లను తొలగించి.. ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని తెలిపింది. దీనిని విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అదేసమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు, సర్ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కూడా పాఠ్యాంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఎన్ సీఆర్టీ వివరించింది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘంపై సర్ విషయంలో వచ్చిన ఒత్తిళ్లు, న్యాయప్రక్రియ, సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రజల అభిప్రాయం పారదర్శకత.. వంటివాటికి కూడా ఈ పాఠ్యాంశంలో ప్రాధాన్యం కల్పించారు. ఎన్నికల సంఘం ఎంతో సవాల్గా తీసుకుని నిర్వహించిన ఈ ప్రక్రియకు చారిత్రక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
ఏడాది పూర్తి!
దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. తొలుత గత ఏడాది(2025) బీహార్లో సర్ ప్రక్రియను ప్రారంభించారు. అప్పట్లో ఎన్నికలకు ముందు నిర్వహించిన ఈ సర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు, అనుమానాలు కూడా తెరమీదికి వచ్చాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు దాఖలయ్యాయి. మొత్తంగా వాటిని అధిగమిస్తూనే.. మరోవైపు సర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకువెళ్లింది. ఆ రాస్ట్రంలో 65 లక్షల ఓట్లను తొలగించడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates