ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు దశాబ్దాలుగా ప్రమాదపుటంచునే ఉండడం గమనార్హం. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంలో భౌతికంగా ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు పూర్తిగా బుగ్గి అయ్యారు. అయితే.. వాస్తవానికి గత దశాబ్దన్నర కాలంగా నిత్యం.. ఇక్కడి కార్మికులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం ఒక్కటే కాదు.. అంతర్గతంగా జరుగుతున్న అనేక మార్పులు కూడా కార్మికులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
రోజూ మామూలే..
విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీసుకున్న తీర్మానం అనంతరం.. కార్మికుల భద్రత గాలిలో దీపంగా మారిందన్న విమర్శలు వున్నాయి. తమకు కనీసం భద్రత కొరవడిందని నెల రోజుల కిందట 50 మంది కార్మికులు మీడియా ముందుకు వచ్చారు. జీఎంకు లేఖలు కూడా రాశారు. కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. ఇక, రోజూ మెటల్ సెక్షన్లో పనిచేసేవారికి సరైన భద్రత లేకుండా పోయిందని తెలుస్తోంది. వారే స్వయంగా తమ భద్రతను చూసుకునే పరిస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు కూడా ఆరోపించాయి. ఇలాంటి అత్యంత హాట్ సిట్యుయేషనలో పనిచేస్తున్న కార్మికులకు చల్లని నీటిని అందుబాటులో ఉంచుతారు.
ఇటీవల 6 డ్రమ్ములకు గాను.. రెండు డ్రమ్ములే అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ నీటిని నింపే పరిస్థితి లేదని తామే పోసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ డ్రమ్ముల్లోని నీటిని ఎప్పటికప్పుడు కార్మికులపై చిలకరిస్తారు. తద్వారా మెటల్ వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడెక్కినప్పుడు.. కార్మికులు ఆ వేడి నుంచి రక్షించుకునేందుకు ఇది దోహద పడుతుంది. ఇక, ఉద్యోగ భద్రత కార్మికులకు నేతిబీర చందంగా మారింది. నిరంతరం.. వారు దిగులు, విచారంతోనే పనుల్లోకి దిగుతున్నారు. ఈ రోజు వచ్చాం.. రేపు వస్తామో.. లేదో అనే బెంగ వారిని వెంటాడుతూనే ఉంది. మౌలిక సదుపాయాల కొరత, భద్రత లేకపోవడంతో దినదిన గండంగానే విశాఖ ఉక్కు కార్మికులు విధులు చేస్తున్నారు.
ఇప్పుడెవరిది బాధ్యత?
స్టీల్ ప్లాంట్లలో జరిగే ప్రమాదాలపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కార్మికులకు పటిష్టమైన భద్రత కల్పించాలని.. అక్కడే వైద్యశాల ఉండాలని కూడా పేర్కొంది. కానీ, విశాఖ ప్లాంట్లో వైద్యశాలను ఐదేళ్ల కిందటే మూసేశారు. తాజాగా జరిగిన ప్రమాదంలో బాధితులను సుమారు 4 కిలో మీటర్ల దూరంలో ఆసుపత్రికి తరలించారు.
ఈలోగా ఇద్దరు మృతి చెందారు. ఇక, కార్మికులకు రక్షణ కల్పించేలా ప్లాంట్లో శీతల యంత్రాలను ఏర్పాటు చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు జిందాల్ స్టీల్ విషయంలో తీర్పు చెప్పింది. విశాఖలో ఆ ఏర్పాటు కూడా లేదు. ఇలా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రమాదపుటంచునే పనిచేశారు. ప్రస్తుతం ప్రమాదంలో చిక్కి.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates