చరిత్ర సృష్టించిన భారత్!

​టీమ్ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ ట్రోఫీని గెలుచుకుంది. 2024లో కప్పు గెలిచిన భారత్, ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్‌గా నిలిచి వరుసగా రెండుసార్లు ఈ ఫీట్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర పుటల్లోకెక్కింది. ఫైనల్ పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తిరుగులేని ప్రదర్శన కనబరిచిన భారత్, కివీస్ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.

​ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు బాది జట్టుకు కొండంత స్కోరును అందించాడు. ఇషాన్ కిషన్ (54) కూడా అర్ధసెంచరీతో రాణించగా, చివర్లో శివం దూబే కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కివీస్ బౌలర్లలో జిమ్మీ నీషమ్ మూడు వికెట్లు తీసినా పరుగులను మాత్రం నియంత్రించలేకపోయాడు.

​256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే పోరాడారు, మిగిలిన వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి కివీస్ కి వణుకు పుట్టించాడు. అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లు తీసి తన వంతు సహకారం అందించాడు.

​కివీస్ ఇన్నింగ్స్ ముగియగానే భారత్ సంబరాలు మొదలయ్యాయి. ​గతంలో ఇదే మైదానంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను తుడిచివేస్తూ భారత్ ఈ విజయాన్ని అందుకుంది. 1,32,000 మంది ప్రేక్షకుల సమక్షంలో భారత ఆటగాళ్లు కప్పును గాల్లోకి లేపిన క్షణం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా, ఫైనల్‌లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను రిజర్వ్ చేసి ఉంచినట్లు కనిపించింది. బ్యాటర్ల విధ్వంసం, బుమ్రా స్పల్ భారత విజయానికి పునాది వేశాయి. ​మొత్తానికి అహ్మదాబాద్ గడ్డపై భారత్ మరోసారి ప్రపంచ జేతగా అవతరించింది. వరుసగా రెండు వరల్డ్ కప్‌లు గెలవడం అనేది భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్.