టీ20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 209 పరుగులు చేయగా, అనంతరం నమీబియా కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. స్కోరు బోర్డు మీద అంకెలు ఘనంగానే కనిపిస్తున్నా, లోతుగా గమనిస్తే భారత బ్యాటింగ్ లైనప్లో ఆందోళన కలిగించే అంశాలు అలాగే ఉన్నాయి. పసికూనలపై చెలరేగిపోతారని ఆశిస్తే, ఆశించిన స్థాయిలో డామినేషన్ మాత్రం కనిపించలేదు.
నిజానికి భారత్ ఇన్నింగ్స్ మొదలైన తీరు చూస్తే స్కోరు సులభంగా 250 దాటుతుందని అనిపించింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ పాండ్యా (52) అర్ధ సెంచరీలతో మెరిసినా, జట్టు స్పీడ్ పెంచిన ప్రతిసారీ వికెట్లు పారేసుకోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీ స్కోరు సాధించే క్రమంలో వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఒక దశలో టీమిండియా 200 దాటడం కూడా కష్టమైంది. పసికూన జట్టుపై కూడా వికెట్ల పతనాన్ని నియంత్రించలేకపోవడం జట్టు బలహీనతను చూపిస్తోంది.
మొన్న అమెరికాతో ఆడినప్పుడే భారత టాప్ ఆర్డర్ తడబడింది. ఇప్పుడు నమీబియాతో అయినా ఆ లోపాలను సరిదిద్దుకుని అసలైన ఆధిపత్యం చూపిస్తారని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ, అంచనాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ లైనప్లో బలం కనిపించలేదు. సంజూ శామ్సన్ (22), తిలక్ వర్మ (25) వంటి వారు మంచి ఆరంభాలు ఇచ్చినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో కేవలం 12 పరుగులే చేశాడు.
బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ తన సత్తా చాటింది. వరుణ్ చక్రవర్తి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి నమీబియాను దెబ్బ కొట్టాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లతో రాణించారు. బౌలర్లు తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసినా, బ్యాటర్లు మాత్రం ఇంకా గాడిలో పడాల్సి ఉంది.
సూపర్ 8 మ్యాచ్లకు వెళ్లే ముందు ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోకపోతే పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఇబ్బందులు తప్పవు. భారత్ వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసి టోర్నీలో దూసుకుపోతున్నా, బ్యాటింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ 15వ తేదీన పాకిస్తాన్ తో తలబడనున్న విషయం తెలిసిందే. మరి ఆ మ్యాచ్ లో అయినా బ్యాటర్లు ఫుల్ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates