అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఎంత డేంజర్ అంటే..

రుచిగా ఉంటాయి. సులభంగా దొరుకుతాయి. వేడి చేసి నిమిషాల్లో తినవచ్చు. కానీ రెడీ-టు-ఈట్, రెడీ-టు-హీట్ ఆహారాల ముసుగులో మన ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా మింగేస్తున్నాయి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF). ఇటీవలి ఓ ప్రపంచ స్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆహారాల వినియోగం అధికమైతే, అకాల మరణ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందట.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయన ఫలితాల ప్రకారం, UPFల వినియోగం 10 శాతం పెరిగితే, అన్ని రకాల మరణాల ముప్పు 3 శాతం పెరుగుతుందట. ముఖ్యంగా అమెరికా, యూకే వంటి దేశాల్లో ఈ ప్రమాదం మ‌రింత గణనీయంగా ఉంది. యూఎస్ లో ఓ వ్యక్తి తీసుకునే మొత్తం కేలరీలలో 50 శాతం పైగా UPFలే. అదే కొలంబియాలో ఈ గణాంకం కేవలం 15 శాతం మాత్రమే. అందుకే అక్కడ అలాంటి ప్రమాదం తక్కువగా ఉంది.

ఈ UPFల్లో సహజ పదార్థాల కన్నా కృత్రిమ రంగులు, రుచులు, ప్రిజర్వేటివ్‌లు అధికంగా ఉంటాయి. మసాలా నూడుల్స్, ప్యాకెట్ చిప్స్, ఫ్రోజన్ పిజ్జాలు, బేకరీ ఐటమ్స్ అన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇవి అధికంగా సోడియం, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌తో నిండి ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి 32 రకాల జబ్బులకు అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో సహా ఎనిమిది దేశాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడిప్పుడే UPFల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్‌లలో సహజమైన పండ్లు, కూరగాయల కన్నా ఫ్యాన్సీ ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. చిన్న పిల్లల నుంచీ పెద్దల వరకూ ఈ అలవాటు పెరిగిపోవడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పడాలని, తాజా, స్వచ్ఛమైన ఆహారం వైపు మళ్లాలని సూచిస్తున్నారు నిపుణులు. స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన పదార్థాలను ప్రోత్సహించాలి. అలాగే ప్రభుత్వాలు కూడా శాశ్వత ఆరోగ్య విధానాలను రూపొందించి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని పరిశోధకులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుంచుకొని, ఫ్యాన్సీ ప్యాకెట్లకు దూరంగా ఉండడం అవసరం.