ఫైనల్‌లో ఇండియాను ఓడిస్తానన్నావ్? ఇప్పుడేమైంది?

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాజయం ఎదురైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయం పాలవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇబ్రహీం చాడ్రాన్ 177 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలకంగా మారింది. 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 317 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో వాళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణం నిరాశగా ముగిసింది.

అయితే, ఈ పరాజయం కంటే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నది బెన్ డకెట్. ఇటీవల భారత వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-0 తేడాతో ఓటమిని మూటగట్టుకున్నా, డకెట్ మాత్రం ఆ పరాజయాన్ని తేలికగా తీసుకున్నాడు. అతడు మీడియా ముందు మాట్లాడుతూ, “ఇది పెద్ద విషయం కాదు.. మేము ఛాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్ పెట్టాం. ఫైనల్లో ఇండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాం” అంటూ ధీమాగా వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు తన జట్టు సెమీఫైనల్‌కే చేరకుండానే ఇంటిదారి పట్టింది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు డకెట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “ఫైనల్‌లో ఇండియాను ఓడిస్తానన్నావ్? ఇప్పుడేమైంది?” అంటూ అతని కామెంట్స్ ను గుర్తుచేస్తున్నారు. “ఇంగ్లాండ్ జట్టు కేవలం మాటల్లోనే ముందుంది, మైదానంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వన్డే ఫార్మాట్‌లో దూకుడు మామూలే అయినా, ఆ ప్రణాళికకు అనుగుణంగా బౌలింగ్, ఫీల్డింగ్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్ వరుసగా ఓడిపోతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే టెస్టుల్లో ‘బజ్‌బాల్’ అనే పేరుతో అటాక్ చేసే ఆటతీరును ఇంగ్లాండ్ వన్డేలకు కూడా మించుకుందామనుకుంది. కానీ మైదానంలో ఆ ప్రణాళిక పనిచేయలేదు. పేస్, స్పిన్ బౌలింగ్‌కు సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. వరుసగా రెండు పరాజయాలతో ఇంటిదారి పట్టిన ఇంగ్లాండ్ గురించి ఇప్పుడు క్రికెట్ లోకమే కౌంటర్స్ వేస్తోంది. ఇక మాటలు చెప్పడం కాదు.. మైదానంలో రాణించడం ముఖ్యం అని ఈ ఓటమి వారి మదిలో మిగిలిపోతుందేమో చూడాలి.