Top Rated

లాక్డౌన్లో కృష్ణుడి కథలు

లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కళ్లూ ఒక్కోలా గడిపారు.
కానీ వనం జ్వాలా నరసింహారావు గారంత ఫలవంతంగా వాడుకున్న వారు చాలా అరుదు.
ఏదో సంకల్పించి, మొదలుపెట్టి నెమ్మదిగా సాగదీయకుండా…328 పేజీల కథల పుస్తకాన్ని 48 రోజుల్లో రాసేసి, అచ్చువేసేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇందులోని కథలన్నీ భాగవతంలోనివి. అది కూడా పోతన భాగవతంలో నిక్షిప్తమై ఉన్నవి.

వనం జ్వాలానరసింహారవు గారు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి వద్ద పధాన ప్రజా పౌరసంబంధాల అధికారి. గతంలో వీరు వివిధ హోదాల్లో నాటి గవర్నర్ కుముద్బెన్ జోషీ గారికి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారికి అధికారిగా సేవలందించారు. వృత్తిపరంగా అలా ఉంటే, ప్రవృత్తిపరంగా వీరు సాహితీవేత్త. ప్రాచీన కావ్యాలపట్ల అభిరుచి, వాటిని ప్రస్తుత తరానికి తగు భాషలో అందించాలనే తపన వీరిది. వేదాల మీద అధ్యయనం, ఛందశ్శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు కూడా చేసారీయన.

ఇక “శ్రీమద్భాగవత కథలు” పుస్తకానికి వస్తే, 48 రోజుల్లో 88 కథలతో ఇంత గ్రంథం వ్రాసారంటే నమ్మశక్యంగా అనిపించదు. అసలు పోతన భాగవతంలో పద్యరూపంలో ఉన్న కథలను చదివి అర్థం చేసుకోవడానికే ఆ సమయం సామాన్యంగా సరిపోదు.

నరం, నాడి, శ్వాస, బుద్ధి సమస్తం భాగవతమయం అయిపోయి అదే పనిగా ఒక తపస్సులా రాస్తే తప్ప ఇంత తక్కువ సమయంలో ఇంతటి పుస్తకాన్ని బయటకు తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. ఆ తపస్సు వనం జ్వాలా నరసింహారావుగారికి ఫలించింది. ఈ పుస్తకం సాక్షాత్కారమయింది.

ఈ పుస్తకంలో హెడ్డింగ్స్ చదివితేనే భాగవత జ్ఞానం కొంతైనా వస్తుంది. రకరకాల పాత్రలు…ఎవరు ఎవరిని చంపారు…ఎవరు ఎవరిని శపించారు…ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు…లాంటి విషయాలు టైటిల్స్ లోనే చెప్పేశారు…అలా కథను చదివించే ఉత్సుకతని పెంచారు. ఉదాహరణకి ఇవి చూడండి.

— శమీకుడి కొడుకు శృంగి శాపానికి గురైన పరీక్షిత్తు
— దేవహూతిని వివాహం చేసుకున్న కర్దమ ప్రజాపతి
— నారాయణ నామస్మరణతో ముక్తి పొందిన అజామిళుడు
— ధర్మరాజు రాజసూయ యాగం-జరాసంధ, శిశుపాల వధ
— సాళ్వుడిని, దంతవక్తృడిని వధించిన శ్రీకృష్ణుడు

ఫలానా అని చెప్పను కానీ, ఇందులో కొన్ని కథలను సోషలైజ్ చేసి మోడర్నైజ్ చేస్తే సినిమాలకి సరిపోతాయనిపించింది.

ఇందులో కొన్నిటిని కథలు అనలేం. వివరణాత్మకమైన వ్యాసాల్లా అనిపిస్తాయి. వాటిల్లో తెలుసుకోదగ్గ ఆసక్తికరమైన విషయాలు అనేకం ఉంటాయి.

కొన్ని కథల్లో మధ్యలో మూలంలోని పోతన పద్యాలను కూడా ప్రస్తావించారు. అది కూడా అవసరమైనచోట మాత్రమే.

భాగవతం బాగా తెలుసనుకున్న వారికి కూడా ఇందులోని కథలు అన్నీ తెలియవు. పద్యరూపంలో ఉన్న పోతన భాగవతం చదవలేని నేటి తరానికి వనం జ్వాలానరసింహారావుగారు గొప్ప సాయం చేసి పెట్టారు. ఈ కథల పుస్తకం చదివేస్తే భాగవతం చదివినట్టే. ధర్మం, నీతి, న్యాయం, సహేతుకత్వం, వేదాంతం, ఆధ్యాత్మికత…ఇలా ఎన్నో అంశాలు ఈ కథల్లో కనిపిస్తాయి.

కొన్ని కథల్లోని వాక్యాలు భాగవతంపై గౌరవాన్ని పెంచుతాయి, ఆలోచింపజేస్తాయి, ప్రస్తుత కాలానికి కూడా రిలవెంట్ గా ఉన్నాయనిపిస్తాయి…ఉదాహరణకి ఒక కథలో నారదుడు వర్ణాశ్రమ ధర్మాల గురించి ఇలా అంటాడు- “పుట్టుకతో మానవుడి కులాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహాదులు మొదలైన లక్షణాల ఆచరణతో గుర్తించాలి..”

ఈ కథల్లోని సరళమైన వ్యవహారిక భాష వేగంగా చదివిస్తుంది. కథలు కూడా సాధ్యమైనంత తక్కువ నిడివిలో చెప్పారు. క్లుప్తంగా చెప్పినా మొత్తంగా చెప్పారు..సూక్ష్మంలో మోక్షం లాగ అన్నమాట. సగటున ప్రతి కథ 2-3 పేజీల్లో అయిపోతుంది. ఒక్కో కథకి ఒక్కో వ్యాఖ్యానం, ఒక్కో వివరణ చెప్పవచ్చు.

ఆద్యంతం ఆసక్తిగా సాగే ఈ పుస్తకం బమ్మెర పోతన వ్రాసిన భాగవతంలోని కథలని తెలుసుకోవాలనుకునే వారికి తప్పక నచ్చుతుంది.

ముక్తాయింపుగా ఈ పుస్తకం వ్రాసిన వనం వారికి అభినందనగా ఒక కందపద్య కుసుమం.

లీలాకృష్ణుని కథ- కల
కాలమ్మున నిలిచియుండు కమనీయముగా;
చాలా బాగా వ్రాసిన
జ్వాలా నరసింహరావు చరితకునెక్కున్.

— సిరాశ్రీ

This post was last modified on December 11, 2020 11:29 am

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

43 minutes ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

3 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

3 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

4 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

4 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

6 hours ago