2021 ఐపీఎల్.. ఎప్పుడు, ఎక్కడ?

ఐపీఎల్ పదమూడో సీజన్ ముగింపు దశకు వచ్చింది. టోర్నీలో ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతిసారీ ఐపీఎల్ ముగిసే సమయానికి అయ్యో అప్పుడే టోర్నీ అయిపోతుందా.. మళ్లీ లీగ్ కోసం ఇంకో పది నెలలు ఎదురు చూడాలా అన్న నిట్టూర్పు అభిమానుల్లో కలుగుతుంటుంది. ఐతే ఈసారి మరీ అంత బాధ పడాల్సిన పని లేదు. ఈ ఏడాది లీగ్ జరగడమే ఐదు నెలలు ఆలస్యంగా జరిగింది. దీంతో తర్వాతి లీగ్‌కు ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

ఇంకో ఐదు నెలల్లోనే 2021 ఐపీఎల్ జరగబోతోంది. తక్కువ గ్యాప్ వస్తుంది కాబట్టి, కరోనాను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ఐపీఎల్‌ను కొంచెం ఆలస్యంగా నిర్వహిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఖండించాడు. వచ్చే ఐపీఎల్ ఎప్పట్లాగే ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుందని స్పష్టం చేశాడు.

టోర్నీ వేదిక విషయంలో కూడా గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఆ టోర్నీని ఇండియాలోనే నిర్వహించాలనుకుంటున్నామని గంగూలీ వెల్లడించాడు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రావాల్సి ఉంది. దాన్ని బయో బబుల్ వాతావరణంలో నిర్వహిస్తామని, అలాగే కొత్త ఏఢాదిలో దేశవాళీ సీజన్‌ను సైతం మొదలుపెడతామని.. ఇవి రెండూ విజయవంతంగా జరిగితే ఐపీఎల్‌ను కూడా బయో బబుల్ వాతావరణంలో ఇండియాలోనే నిర్వహించడానికి అడ్డంకులేమీ ఉండవని గంగూలీ అన్నాడు.

ఎలాగూ ఇండియాలో ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, పైగా జనాల్లో భయం కూడా తగ్గిపోయింది. కొత్త ఏడాదిలో థియేటర్లు కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను 50 శాతం కెపాసిటీతో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఐపీఎల్ సమయానికి కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశమున్న నేపథ్యంలో లీగ్ స్వదేశంలో జరిగే అవకాశాలు మెండుగా ఉన్నట్లే.