ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఫొటో షూట్.. ట్విస్టేంటంటే?

ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్లు ఎన్నెన్ని కొత్త పుంతలు తొక్కుతున్నాయో చూస్తూనే ఉన్నాం. మిగతా వాళ్లకు భిన్నంగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో కొన్ని జంటలు మరీ శ్రుతి మించి పోతున్నాయి. ఒక జంట వరి పొలంలో బురద పూసుకుంటూ చేసిన ప్రి వెడ్డింగ్ షూట్ ఎంతగా చర్చనీయాంశం అయిందో, దాని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో తెలిసిందే.

దాన్ని మించి ఈ మధ్య ఓ జంట చేసిన ఫొటో షూట్ వైరల్ అయింది. విపరీతంగా ట్రోల్‌కు గురైంది. ఓ అమ్మాయి అబ్బాయి టూ రొమాంటిగ్గా ఆ ఫొటో షూట్ చేసింది. ఇద్దరి దేహాలపై పెద్దగా బట్టల్లేకపోవడం, రొమాన్స్ శ్రుతి మించి పోవడం, కొన్ని ఫొటోలూ వల్గర్‌గా అనిపించడంతో ఇంటర్నెట్ జనాలు వాళ్లపై విరుచుకుపడ్డారు. విపరీతంగా ట్రోల్‌కు గురైందీ ఫొటో షూట్. ఐతే ఈ ఫొటో షూట్ చేసిన జంట ఇప్పుడు ఓ ప్రముఖ న్యూస్ వెబ్ సైట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఫొటో షూట్ గురించి క్లారిటీ ఇచ్చింది.

అసలు తాము చేసింది ప్రి వెడ్డింగ్ షూట్ కాదని, కొన్ని నెలల కిందటే పెళ్లి చేసుకున్నాక ఈ ఫొటో షూట్ చేశామని, అందరూ అనుకుంటున్నట్లు తామేమీ శృంగారం కోసం తపించిపోయే పరిస్థితుల్లో లేమని ఆ జంట స్పష్టత ఇచ్చింది. ఈ అబ్బాయి, అమ్మాయిల పేర్లు హృషి, లక్ష్మి అట. వారిది కేరళ అట. లాక్ డౌన్ టైంలో తమ పెళ్లి పరిమితమైన అతిథుల మధ్య చాలా సింపుల్‌గా జరిగిందని.. ఐతే పెళ్లి అలా సింపుల్‌గా జరిగిన నేపథ్యంలో పోస్ట్ వెడ్డింగ్ షూట్ ప్రత్యేకంగా ఉండాలనుకున్నామని.. ఇంటర్నెట్లో వెతికి ఒక కాన్సెప్ట్ అనుకుని తమ స్నేహితుడితోనే ఈ ఫొటోలు తీసుకున్నామని.. కానీ ఆ ఫొటోలు ఇంటర్నెట్లో అంతగా వైరల్ అవుతాయనుకోలేదని.. తమను చాలామంది దారుణమైన తిట్లు తిట్టారని హృషి, లక్ష్మి వెల్లడించారు.

మీరు పోర్నోగ్రఫీకి, కండోమ్ ప్రకటనలకు సరిపోతారు.. అంత ఆగలేకపోతుంటే రూమ్‌కు వెళ్లండి.. మీరసలు లోపల బట్టలేసుకున్నారా.. పబ్లిసిటీ కోసం ఇంత చేస్తారా.. ఇలాంటి కామెంట్లు ఎన్నో విన్నామని.. ఒక సమయంలో బాగా భయమేసిందని.. ఐతే కొన్ని రోజుల తర్వాత తమకు మద్దతుగా చాలామంది ముందుకొచ్చారని, తమ ఫొటో షూట్‌లో ఒక అభిరుచి ఉందని పొగిడారని.. దీంతో కొంత ఉపశమనం కలిగిందని.. ఇప్పుడు ఈ ఫొటో షూట్ విషయం మరిచిపోయి తామిద్దరం ప్రశాంతగా ఉన్నామని లక్ష్మి వెల్లడించింది.