కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ఎట్టకేలకు..

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎంతగా ఎదురు చూస్తోందో తెలిసిందే. వైరస్ దానంతట అది తగ్గుముఖం పట్టే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. హెర్డ్ ఇమ్యూనిటీ మీద ఆశలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇక ప్రభుత్వాలు చేపట్టే చర్యలు కానీ, జనాల స్వీయ క్రమశిక్షణ కానీ.. సరిపడా స్థాయిలో లేకపోవడంతో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నేపథ్యంలో కరోనా తాలూకు సంక్షోభానికి తెరపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు జరిగాయి. ట్రయల్స్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఐతే విదేశాల్లో ఈ పరిశోధనలు ఆరంభం కావడం ఆలస్యం.. వివిధ సంస్థలతో అక్కడి ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యాక్సిన్ ఆమోదం పొంది ఉత్పత్తి మొదలు కాగానే తమకు ఇంత స్థాయిలో డోస్‌లు ఇవ్వాలనే విధంగా ఈ ఒప్పందాలు జరిగాయి.

కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వం ఈ దిశగా అడుగులేమీ వేయలేదు. వ్యాక్సిన్ తయారీలో దాదాపు పది సంస్థలు నిమగ్నమై ఉండగా.. వేటితోనూ సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు రాలేదు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఎవరికి వాళ్లు సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకోవడమే తప్ప.. ప్రభుత్వం తమ వంతుగా ఏం చేయదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నెలలు గడిచాక ప్రభుత్వం వ్యాక్సిన్లు కొని.. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే వాటిని అందిస్తుందేమో అనుకున్నారు. కానీ ప్రభుత్వం అలా ఏమీ ఆలోచించట్లేదని తాజా చర్యలతో అర్థమవుతోంది. వ్యాక్సిన్ పరిశోధనల్లో చురుగ్గా ఉన్న భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సహా ఐదు సంస్థలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. వాటితో ఒప్పందాలు కూడా చేసుకుంది. ట్రయల్స్ పూర్తవగానే ప్రభుత్వ అనుమతులు సాధ్యమైనంత త్వరగా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాబట్టి ఈ ఏడాది ఆఖర్లోపు వ్యాక్సిన్ రెడీ కావడం, మొత్తం జనాభాకు అవసరమైన మేర ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొని అందరికీ ఉచితంగా, లేదా తక్కువ ధరతో వ్యాక్సిన్లు వేయడం చేయొచ్చని తెలుస్తోంది.