RRR:అభిమానుల దెబ్బకు ఈవెంట్ రద్దు

అంచనాలను మించేలా సినిమాలు తీయడమే కాదు.. వాటిని తనదైన శైలిలో ప్రమోట్ చేయడం, మార్కెట్ చేయడంలోనూ రాజమౌళి నిపుణుడు. ‘బాహుబలి’ సినిమా ఆ స్థాయి విజయం సాధించిందంటే దాని వెనుక రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా కీలకం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ తనదైన శైలిలో ప్రమోషన్లు ప్లాన్ చేశాడు జక్కన్న. రిలీజ్‌కు సరిగ్గా నెల రోజుల సమయం ఉండగా.. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా ఒకే రోజు ముంబయిలో, అలాగే హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ప్లాన్ చేశాడు.

మధ్యాహ్నం ముంబయిలో హిందీ మీడియాతో ‘ఆర్ఆర్ఆర్’ టీం ముచ్చటించింది. ఆద్యంతం హుషారుగా సాగిపోయిందీ ప్రోగ్రాం. శంకర్ సినిమా షూట్ ఉండటం వల్ల చరణ్ ఈ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయాడు. సాయంత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ టీం హైదరాబాద్‌లో మీడియాను కలవాల్సింది.ఓ మల్టీప్లెక్స్‌లో అఫీషియల్‌గా ట్రైలర్ లాంచ్ చేసి.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోర్ టీం మీడియాతో ముచ్చటించాల్సింది.

ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా హాజరు కావాల్సింది. ఇందుకోసం కొంచెం ఘనంగానే ఏర్పాట్లు చేశారు. ఐతే కేవలం ప్రెస్ వాళ్లనే ఈ ఈవెంట్‌కు ఆహ్వానించగా.. దీని గురించి సమాచారం అందుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆ మల్టీప్లెక్స్‌కు వచ్చేశారు.

కాసేపటికే పరిస్థితి ఎలా తయారైందంటే సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపు చేయడం చాలా కష్టమైపోయింది. హీరోలిద్దరూ రాకముందే పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. ఇక తారక్, చరణ్‌లిద్దరూ వస్తే తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని, అభిమానులను అదుపు చేయడం చాలా కష్టమైపోతుందని అంచనా వేసి స్వయంగా రాజమౌళే ఈ ప్రెస్ మీట్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసేశాడు. అప్పటికే పెద్ద ఎత్తున వేదికకు చేరుకున్న మీడియా వాళ్లకు క్షమాపణలు చెప్పి మరీ ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రెస్ వాళ్లతో హీరోలిద్దరూ, మిగతా టీం మాట్లాడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు