టెన్షన్ తీర్చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్కల ప్రకారం అయితే ఈపాటికి రీఎంట్రీలో ఆయన రెండు సినిమాలు పూర్తి చేసి ఉండాలి. అవి విడుదల కూడా అయిపోయుండాలి. కానీ ఇంకా పునరాగమనంలో తొలి సినిమా ‘వకీల్ సాబ్’ కూడా విడుదల కాలేదు. కరోనా కారణంగా ఆయన ప్రణాళికలన్నీ దెబ్బ తినగా.. ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’ను ముగించాడు. దీని తర్వాత మామూలుగా అయితే క్రిష్ సినిమా మొదలు కావాలి. కానీ మధ్యలో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ వచ్చి పడింది.

పవన్ ఆ సినిమాను ముందుకు తీసుకొస్తున్నాడని.. క్రిష్ సినిమా ఆలస్యం కాబోతోందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఈ చిత్రంపై క్రిష్ కోరుకున్నంతగా పవన్ ఫోకస్ పెట్టట్లేదని.. మొదట్నుంచి ఈ సినిమాకు అరకొరగానే డేట్లిస్తున్నాడని.. సినిమాకు ఏదో ఒక అవాంతరం తప్పట్లేదని.. ఇలా రకరకాలుగా వార్తలొచ్చాయి.

ఈ మధ్యే క్రిష్ కరోనా బారిన కూడా పడటంతో ఈ చిత్రం ఎప్పటికి పున:ప్రారంభం అవుతుందో.. ఎప్పటికి పూర్తవుతుందో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ ట్విట్టర్లో అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇచ్చింది. సెట్ నుంచి ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు. కాకపోతే వాటిలో క్రిష్, ఎ.ఎం.రత్నం మాత్రమే కనిపించారు. పవన్ కనిపించలేదు.

ఈ సినిమాలో పవన్ స్పెషల్ లుక్‌లో కనిపించనున్న నేపథ్యంలో అది బయటికి రాకూడదన్న ఉద్దేశంతోనే ఆయన్ని చూపించి ఉండకపోవచ్చు. ఈ సినిమా విషయంలో పవన్ టెన్షన్ తీర్చేశాడు. షూటింగ్‌కు హాజరవుతున్నాడు. సినిమా తీయడంలో క్రిష్ స్పీడేంటో అందరికీ తెలిసిందే కాబట్టి.. ఇక శరవేగంగా సినిమా పూర్తయిపోతుందని, ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతుందని ఆశించవచ్చు. సీనియర్ సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం తొలిసారి పవన్‌తో జట్టు కట్టడం విశేషం.