తన అభిమానులు వేరంటున్న వెంకీ

అభిమానులందు నా అభిమానులు వేరు అంటున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వేరే హీరోల అభిమానుల మాదిరి తన ఫ్యాన్స్ తనపై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోరని వెంకీ వ్యాఖ్యానించడం విశేషం.

వెంకీ గత సినిమా ‘నారప్ప’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ బాట పట్టగా.. ఇప్పుడు ఆయన మరో చిత్రం ‘దృశ్యం-2’ కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘నారప్ప’ టైంలోనే చాలా అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు వరుసగా రెండో సినిమా కూడా ఓటీటీలో వస్తుండటంతో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మరి ఇదే విషయం వెంకీ దగ్గర ప్రస్తావిస్తే.. “ఏం చేస్తాం. ఈ ఏడాదికి అలా అయిపోయింది. నా అభిమానులు చాలా ఓపికతో ఉంటారు. నాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా నన్ను ప్రోత్సహిస్తారు. అన్నింటికీ టైం వస్తుంది. కచ్చితంగా వాళ్లు థియేటర్లలో బాగా ఎంజాయ్ చేసే సినిమాను అందిస్తాను. ‘ఎఫ్-3’తో వాళ్లకు డబుల్ ట్రీట్ ఉంటుంది” అని వెంకీ చెప్పాడు.

‘దృశ్యం-2’ తర్వాత ‘దృశ్యం-3’ కూడా ఉంటుందా అని వెంకీని అడిగితే.. ఉండొచ్చని, అందుకు కొన్నేళ్ల సమయం పట్టొచ్చని, అప్పటికి రాంబాబుకు గడ్డం ఇంకా మెరిసిపోతుందని.. పిల్లలు ఇంకా పెద్ద వాళ్లు అవుతారని చమత్కరించడం విశేషం. దర్శకుడు జీతు జోసెఫ్‌తో మరో సీక్వెల్ గురించి కొంత చర్చ నడిచిందని ఆయనన్నాడు.

ప్రస్తుతం చేస్తున్న ‘ఎఫ్-3’ మినహా ఇంకే కొత్త సినిమా ఒప్పుకోలేదన్న వెంకీ.. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తరుణ్ సహా అందరూ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారని.. ఏది బాగుందనిపిస్తే ఆ సినిమా మొదలుపెడతామని వెంకీ అన్నాడు.