నా భర్తను ఆఫీసుకు రమ్మని చెప్పండి.. భార్య లేఖ వైరల్


కరోనా మహమ్మారి కారణంగా పని విధానం మొత్తం మారిపోయింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేస్తానని కోరితే.. ఓకే చెప్పేది ఐటీ కంపెనీల్లో మాత్రమే. అది కూడా కొన్ని కంపెనీలకే ఈ సదుపాయం ఉండేది. అలాంటిది కరోనా దెబ్బకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి వర్కు ఫ్రం హోం సదుపాయాన్నిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది.. కలలో కూడా సాధ్యం కాదనుకున్న మీడియాలోనూ ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించారు. మీడియాలోనే అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు ఐటీ ఉద్యోగుల సంగతేమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.


ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటి నుంచి పని చేసే విధానానికి చెల్లుచీటి ఇవ్వగా.. ఎక్కువ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరకు పైనే వర్క్‌ ఫ్రం హోం సాగుతోంది. ఇలాంటివేళ.. ఇంట్లో ఉన్న మహిళల మీద పని భారం తీవ్రంగా పెరిగిపోయింది. అంతేకాదు.. ఇంట్లో ఉండి పని చేసే భర్తకు సేవలు చేయటం తలకు మించిన భారంగా తయారైంది. ఇదెంత ఎక్కువన్న విషయాన్ని తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ట్వీట్ చేశారు.


ఉద్యోగి సతీమణి రాసిన లేఖకు ఎలా స్పందించాలో అర్థం కాలేదంటూ ట్వీట్ చేసిన ఆయన.. ఉద్యోగి భార్య పంపిన మొయిల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. అందులో.. వర్కు ఫ్రం హోం ఇదే తీరులో మరికొంతకాలం కొనసాగితే.. తన వైవాహిక బంధం ముగియటం ఖాయమని తేల్చేయటం గమనార్హం. ఇంతకూ ఆయనకు అందిన లేఖలో ఉద్యోగి సతీమణి ఏమని చెప్పారంటే..
‘‘సార్.. మీ సంస్థలో పని చేసే మనోజ్ అనే ఉద్యోగి వైఫ్ ను. మీకు సవినయంగా విన్నవించుకునేదేమంటే.. నా భర్తను ఆఫీసుకు వచ్చి పని చేసేలా అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాడు. అన్ని కొవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాడు. మీరు ఇలానే మరికొంత కాలం నా భర్తకు వర్క్‌ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంటి నుంచి పని చేసే విధానం మొదలైన తర్వాత నుంచి నాకు పని భారంగా విపరీతంగా పెరిగిపోయింది’’ అని వాపోయింది.


వర్క్‌ ఫ్రం హోంతో తానెన్ని కష్టాలు పడుతుందన్న విషయాన్ని సదరు లేఖలో పేర్కొన్నారు. ‘‘నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు. ఒకే గదిలో కూర్చొని పని చేయడు. వేర్వేరు గదుల్లో కూర్చొని పని చేస్తాడు. పైగా అక్కడంతా చెత్త చెత్త చేస్తాడు. రోజుకు ఎన్నిసార్లు తింటాడో లెక్క లేదు. వర్క్ కాల్స్ సమయంలోనూ కూనిక పాట్లు పడుతుంటాడు’ అంటూ ఇంటి నుంచి పని చేసే విధానంలోని లోపాన్ని ఆమె ఎత్తి చూపారు.


అంతేకాదు.. తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారి బాగోగులు చూడటానికి తనకు సమయం సరిపోవటం లేదన్నారు. వారికి తోడు అదనంగా తన భర్త వచ్చి చేరాడని.. అతడికి మరికొంతకాలం ఇదే రీతిలో సేవ చేయటం తన వల్ల కాదని.. తనకు దయచేసి విశ్రాంతి ఇవ్వాలని.. తన భర్తను ఆఫీసుకు తప్పనిసరిగా రావాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ లేఖకు ఎలా స్పందించాలో తనకు అర్థం కావట్లేదని హర్షా గోయెంకా పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.