మ‌హిళ‌ల‌కు దీపావ‌ళి బొనాంజా: చంద్ర‌బాబు కానుక‌

ఏపీలో మ‌హిళ‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దీపావ‌ళి బొనాంజా ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పింఛ‌న్ల‌ను రూ.1000 చొప్పున పెంచి అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ అందిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మ‌రో హామీ అన్న క్యాంటీన్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం. దీనిని కూడా చంద్ర‌బాబు స‌ర్కారు అమ‌లు చేయ‌డం ప్రారంభించింది. ఈ ప‌రంప‌ర‌లో ఇప్పుడు మ‌హిళా ప‌థ‌కాల‌కు కూడా శ్రీకారం చుట్టింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో మహిళ‌ల సెంట్రిక్‌గా చంద్ర‌బాబు 4 కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. ఇవి సూప‌ర్ సిక్స్‌లో భాగంగా ఉన్నాయి. 1) మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. 2) ఆడ‌బిడ్డ నిధి: దీని కింద 18 ఏళ్లు నిండిన ప్ర‌తి యువ‌తి, మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం. 3) మ‌హిళ‌ల‌కు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా ఇవ్వ‌డం. 4) త‌ల్లికి వంద‌నం: ఈ ప‌థ‌కంలో పాఠ‌శాల‌ల‌కు వెళ్లే చిన్నారులు ఉన్న త‌ల్లుల‌కు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం. ఈ 4 కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన కీల‌క హామీలు.

ఈ క్ర‌మంలో తాజాగా ఒక ప‌థ‌కానికి చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అదే.. 3వ ప‌థ‌క‌మైన వంట గ్యాస్ సిలిండర్లు. ఏటా మూడు సిలిండ‌ర్ల‌ను ప్ర‌భుత్వం ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్టు తాజాగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వ‌చ్చే దీపావ‌ళి (అక్టోబరు)పండుగ నుంచి ఈ ప‌థ‌కాన్నిఅమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు కేబినెట్‌లోనూ చ‌ర్చించామ‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం కింద తొలి సిలిండ‌ర్‌ను దీపావ‌ళి రోజు మ‌హిళ‌ల ఇంటికి అందేలా చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో వైట్ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికీ ఈ ప‌థ‌కంలో గ్యాస్ స‌లిండ‌ర్ ఉచితంగా అందుతుంద‌న్నారు. త‌దుప‌రి సిలిండ‌ర్ సంక్రాంతి రోజున, మూడో సిలిండ‌ర్ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం లేదా.. మ‌రోరోజున అందించే ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఈ మేర‌కు చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశారు. దీనివ‌ల్ల మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా వెసులుబాటు క‌లుగుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం వంట గ్యాస్ సిలింద‌ర్ ధ‌ర రూ.830 ఉంది. దీనిని పూర్తి ఉచితంగా అందించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చెప్పారు. ఇత‌ర ప‌థ‌కాల‌ను విడ‌త‌ల వారీగా అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. వైసీపీ హ‌యాంలో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని. అయినా.. తాము ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు వెనుకాడ‌బోమ‌ని అన్నారు. సంప‌ద సృష్టించి.. దానిని పేద‌ల‌కు పంచుతామ‌ని చెప్పారు.