ఏపీ రాజ‌కీయాల నుంచి ఈ టాప్ లీడ‌ర్లు అవుట్‌..?

ఏపీ రాజ‌కీయాల నుంచి వ‌చ్చే ఒక‌టి రెండేళ్ల‌లో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు.. టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్లు క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు… ఇదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో బాగా హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీలో ఉన్న రాజ‌కీయ పార్టీల్లో అన్ని పార్టీల్లోనూ సీనియ‌ర్ల స‌మ‌స్య వెంటాడుతోంది. 2029 ఎన్నిక‌ల నాటికి సీనియ‌ర్ నాయ‌కుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది యువ‌త ముందుకు వ‌చ్చారు. అయితే.. ఇలా యువ ర‌క్తం వ‌స్తే త‌ప్పేంటి? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. త‌ప్పులేదు. కానీ.. సీనియ‌ర్లు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. వారి ఆలోచ‌నా విధానం.. వారి దూర దృష్టి వంటివి పార్టీకి మేలు చేస్తాయి.

పార్టీల ప‌రంగా చూస్తే.. వైసీపీలో ఇప్ప‌టికే బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటాన‌ని చెప్పారు. అయినా.. ఈసారికి పోటీ చేయాలంటూ జ‌గ‌న్ ఆయ‌న‌ను ఒప్పించారు. అదేవిధంగా ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారు. వీరు కూడా ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో దూరంగానే ఉంటాన‌ని చెప్పారు. కానీ, జ‌గ‌న్ ఫోర్స్ చేశారు. ఇక‌, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కూడా ఇదే బాట‌లో ఉన్నారు. వీరు కొంద‌రు మాత్ర‌మే కానీ, ఇలాంటివారు చాలా మందే ఉన్నారు.

టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. ఈ పార్టీలోనూ చాలా మంది సీనియ‌ర్లు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం కానున్నారు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, టీజీ వెంక‌టేష్, కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ వంటివారు దూర‌మ‌య్యారు. ఒక‌రిద్ద‌రు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మాత్రం పోటీకి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. దీనికి ప‌రిమితి ఏమీ పెట్ట‌క‌పోయినా.. వ‌చ్చే నాలుగేళ్ల‌లో పార్టీ ప‌గ్గాల‌ను నారా లోకేష్‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉంది. అందుకే.. యువ‌త‌కు అవ‌కాశం పెంచుతున్నారు.

ఇక‌, జ‌న‌సేన‌లో ఉన్న‌వారే కొన‌సాగుతారు త‌ప్ప‌.. కొత్త‌గా వ‌చ్చే సీనియ‌ర్లు.. లేరు. ఇక‌, బీజేపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే 75 ఏళ్ల వ‌యోప‌రిమితిని అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఆ వ‌య‌సు దాటిని వారు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేసే అవ‌కాశం ఎలానూ లేదు. దీంతో రాజ‌కీయంగా ఇప్పుడు అన్ని పార్టీలకూ యువ‌తే కీల‌కంగా మార‌నున్నారు. ఈ విష‌యంలో టీడీపీ దూకుడుగానే ఉంది. యువ‌త‌కు, కొత్త త‌రం వారికి ప్రాధాన్యం ఇస్తూ.. అటు ఎమ్మెల్యే సీట్లు, ఇటు మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనూ వారిని ప్రోత్స‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం.