ఢిల్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి లాభం ఎంత..?

తాజాగా జరుగుతున్న చర్చలను బట్టి.. తాజాగా వ‌స్తున్న వార్తలను బట్టి.. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి, గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారని, తద్వారా ఢిల్లీలో చక్రం తిప్పుతారని, ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారతారని తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక రోజు ఖ‌చ్చితంగా తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని జిల్లా వాసుల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆసక్తికర చ‌ర్చ‌గా మారింది. అయితే నిజానికి ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి లాభం ఎంత? అసలు చేయగలిగేది ఏంటి? అనేది ఆలోచిస్తే స‌మాధానం లేని ప్ర‌శ్న‌లే వ‌స్తున్నాయి.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది నలుగురు ఎంపీలు మాత్రమే. అందులో ఒకరు రాజీనామా చేస్తే మళ్లీ ఆయన గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచారని అనుకుంటే.. ఢిల్లీకి వెళ్లి జ‌గ‌న్‌ చేసేదేమీ లేదు. తాను తప్ప మిగిలిన ముగ్గురుతో ఢిల్లీలో మోడీని శాసించగలిగిందీ లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన అక్కడ ప్రశ్నించగలిగేది ఉండదు. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే పార్లమెంట్లో ప్రశ్నించ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను ఎంపీ అయినా రాష్ట్ర హోదా గురించి గానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రవేటికరించకుండా చేయడం విషయంలో కానీ ఆయన ప్రశ్నించగలిగేది ఏమీ ఉండదు.

పోనీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయాలన్నా, చంద్రబాబు అవినీతి చేస్తున్నాడు అని చెప్పాలన్నా అక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ కూట‌మి ప్రభుత్వమే. అక్కడ 16 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు మద్దతిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది. అంటే ఇటు సానుకూలంగా కానీ అటు వ్యతిరేకంగా గానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో సాధించగలిగేది ఏమీ కనిపించడం లేదు. పైగా అసెంబ్లీని వదిలేశాడు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోయాడు అన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఆకాశం అంటుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

దీనిని తట్టుకుని మళ్లీ పార్టీని పుంజుకునేల చేయడం ఢిల్లీలో ఉండి సాధ్యం కాదు. పైగా ఢిల్లీ రాజకీయాలు చేస్తూ ఇక ఏపీలో ఉన్న వ్యవహారాలను చక్కబెట్టడం, ఏపీ నేతలతో సమావేశాలు కావడం. ఏపీ అసెంబ్లీలో వాదనలు వినిపించేలా ప్రోత్సహించడం కూడా జగన్మోహన్ రెడ్డికి తలకు మించిన భారంగా మారుతాయి. ఢిల్లీ వెళ్ళిపోయారు అన్న ప్రచారం జరిగితే రాష్ట్ర ప్రజలు కూడా ఇతనికి నిలకడలేదు, పదవులు ఉంటే రాష్ట్రంలో ఉంటారు, పదవులు లేకపోతే ఢిల్లీలో ఉంటారు. అనే వ్యతిరేక ప్రచారం కూడా పెరుగుతుంది.

అంటే ఒక రకంగా తనకు తాను వ్యతిరేక దిశని ఏరి కోరి రివర్స్ మార్గాన్ని ఎంచుకున్నారనే ప్రచారం కచ్చితంగా జరుగుతుంది. అది మైనస్ కూడా అవుతుంది. కాబట్టి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తన పంధాలో తాను అసెంబ్లీకి వెళ్లడం, అసెంబ్లీలో తన వాయిస్ వినిపించగలిగితే మేలు జ‌రుగుతుంది. ఇది సాధ్యం కాక‌పోతే.. లేఖలు రాయడం, రాష్ట్రంలో తిరగడం, రాష్ట్ర ప్రజల మధ్య ఉండడం, ప్రజలు సమస్యలను పట్టించుకోవడం, ప్రాజెక్టులను సందర్శించడం ఇట్లా రకరకాల వ్యూహాలతో పార్టీని పుంజుకునేలా చేయాలి.

అంతేతప్ప ఢిల్లీకి వెళ్లి ఏదో సాధిస్తామని, ఏదో చేస్తామని ఢిల్లీలో ఉంటే ఇక్కడ విమర్శలు ఉండవని చంద్రబాబు నాయుడు నుంచి తనకు ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తే త‌ప్ప‌వుతుంది. అంతేకాదు, జ‌గ‌న్‌ ఢిల్లీకి వెళ్లి పోతే చంద్రబాబు వైపు నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుంది. “నన్ను నా ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేక, నా ప్రభుత్వ అభివృద్ధిని చూసి తట్టుకోలేక జగన్ పారిపోయాడ”ని ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? చెప్పడానికి అవకాశం కూడా లేదు.

అదే సమయంలో పార్టీలో నాయకులు విచ్ఛిన్నమైపోతారు. జగన్ పై ఉన్న విశ్వసనీయత పోతుంది. ఢిల్లీ రాజకీయాలు జగన్ కి ఇప్పుడు అంత సరి సమానమైనవి కాదు. సమంజసం కాదు. కాబట్టి ఆయన.. గతంలో రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు మంచం ఉన్నంతవరకే కాళ్లు ముడుచుకున్న పడుకున్నట్టుగా.. ఉన్న పదిమంది ఎమ్మెల్యేలతోనే పుంజుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తే భవిష్యత్తు ఆయనకు సానుకూలంగా ఉంటుందని మేధావులు సైతం సూచిస్తున్నారు.