వైఎస్ @ 75 : జాడ‌లేని జ‌గ‌న్‌.. ష‌ర్మిల మాత్రం!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల‌కు కావాల్సిన నాయ‌కుడే. తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటోంది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ వైఎస్ కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. 2004, 2009లో వైఎస్ హ‌యాంలోనే వ‌రుస‌గా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. త‌ర్వాత ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం, రాష్ట్ర విభ‌జ‌న సంగ‌తి తెలిసిందే. అయితే.. ప్ర‌తి ఏటా వైఎస్ జ‌యంతిని గ‌త కొన్నాళ్లుగా ప‌రిమితంగా చేస్తూ వ‌చ్చారు. గ‌తంలో కేసీఆర్ హ‌యాం సాగిన‌ప్పుడు.. వైఎస్ జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హించ‌లేదు.

కానీ, ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం, ఏపీలో పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 1 నుంచి 2.8 శాతానికి పుంజుకోవ‌డంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే నెల 8వ తేదీనాటికి వైఎస్ జీవించి ఉంటే 75 ఏళ్లు వ‌చ్చేవి. అయితే.. ఆయ‌న లేనందున 75వ జ‌యంతిని నిర్వ‌హించేందు కు కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అటు హైద‌రాబాద్‌, ఇటు ఏపీలోని విజ‌య‌వాడ‌లోనూ వైఎస్ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఇప్ప‌టికే పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. హైద‌రాబాద్ సంగ‌తి ఎలా ఉన్నా.. ఏపీలో పార్టీ పుంజుకోవాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో వైఎస్ త‌న‌య ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌యంతిని ఆమె ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. విజ‌య‌వాడ శివారులోని పెద్ద గ్రౌండ్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అగ్ర‌నేత‌లు.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు స‌హా.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేను కూడా ఆహ్వానించారు.వారిలో ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. అంద‌రూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, రాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని ష‌ర్మిల వినియోగించుకుంటార‌ని తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ 75వ జ‌యంతితో పార్టీ ప‌రంగా.. ఆమె ఆయ‌న అనుకూల వ‌ర్గాన్ని.. సానుభూతి ప‌రుల‌ను కూడా ఆక‌ర్షించ‌నున్నారు.

ఉలుకు ప‌లుకు లేని జ‌గ‌న్‌..

ఒక‌వైపు.. వైఎస్ జ‌యంతిని గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న పేరుతోనే పార్టీని ఏర్పాటు చేసుకుని.. గ‌త ఐదేళ్లు కూడా.. ఏపీని పాలించిన జ‌గ‌న్‌.. ఈ జ‌యంతి నిర్వ‌హ‌ణ‌పై ఉలుకు ప‌లుకు లేకుండా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక‌వైపు ఏర్పాట్ల‌కు అనుమ‌తులు తీసుకుని.. ఆహ్వాన ప‌త్రిక‌లు కూడా సిద్ధం చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా యి. కానీ, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎక్క‌డా ఊసు క‌నిపించ‌డం లేదు. అసలు ఆయ‌న రాష్ట్రంలో నే లేని విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఇప్పుడు బెంగ‌ళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఓట‌మి నేప‌థ్యంలో తండ్రి జ‌యంతికి కేవ‌లం ఇడుపుల పాయ వెళ్ల నివాళుల‌తో స‌రిపుచ్చుతారా? చెల్లెలితో పోటీ ప‌డి.. తండ్రి జ‌యంతిని నిర్వ‌హిస్తారా? అనేది చూడాలి.