కీల‌క ప్రాజెక్టుల‌పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రంలోని రెండు కీల‌క ప్రాజెక్టుల‌పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న చంద్ర‌బాబును ఇప్ప‌టికే ఎన్డీయే కూట‌మి ప‌క్షాల ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా నాయ‌కులు ఏక‌గీవ్రంగా ఎన్నుకున్నారు. అనంత‌రం కూట‌మి పార్టీల‌కు చెందిన ముఖ్య నేత‌ల బృందం గ‌వ‌ర్నర్ ను క‌లిసింది. త‌మ‌ను ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల‌ని కోరింది. దీనికి సంబంధించి గ‌వ‌ర్న‌ర్ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అనంత‌రం.. బుధ‌వారం ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంది.

కూట‌మి పార్టీల స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. అమ‌రావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారం, పోల‌వ‌రంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ఏక‌గ్రీవంగా అంగీక‌రించిన‌, ఆమోదించిన రాజ‌ధాని అమరావ‌తేన‌ని చెప్పారు. గ‌త హ‌యాంలోనే ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని.. అయితే.. గ‌త ఐదేళ్లలో దీనిని విధ్వంసం చేశార‌ని, ఇప్పుడు ఆ విధ్వంసాన్ని స‌రిచేసి.. మ‌ళ్లీ రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌తిజ్ఞ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను సాకారం చేస్తామ‌న్నారు.

అమ‌రావ‌తిని పూర్తిస్థాయిలో నిర్మించేందుకు వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల్లో ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇకపై మూడు రాజధానులు అనే మాటే వినిపించ‌బోద న్నారు. అయితే.. విశాఖ‌ను ఆర్థిక‌, ఐటీ రాజ‌ధాని న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. అలాగే క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం స‌హ‌కారంతో ముందుకు సాగ‌నున్న‌ట్టు చెప్పారు. అప్పుటు స‌హ‌జంగానే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది జ‌రుగుతుంద‌న్నారు.

ఇక‌, పోల‌వ‌రంపై చంద్ర‌బాబు మాట్లాడుతూ.. త‌న గత పాలనలోనే పోలవరం దాదాపుగా పూర్తి కావొచ్చింద‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ ఐదేళ్లు పోలవరంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను త‌న హ‌యాంలోనే 72 శాతం పూర్తిచేశామని చెప్పారు. ఇప్పుడు సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేసేందుకు క‌ట్టుబడి ఉన్న‌ట్టు చెప్పారు. అవినీతిని స‌హించేది లేద‌ని చెప్పారు.