చదవాల్సిందే: ఉద్యోగులకు రామోజీ రాసిని వీలునామా

తన పిల్లల కోసం తండ్రి రాసే వీలునామా గురించి విని ఉంటాం. అందుకు భిన్నంగా ఒక గ్రూపు సంస్థల ఛైర్మన్ తన ఉద్యోగులను ఉద్దేశించి రాసిన వీలునామా గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ పని చేశారు ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు. తీవ్ర అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఆయన.. తన ఉద్యోగులను ఉద్దేశించి ఒక వీలునామా రాశారు. దాన్ని తాజాగా బయటకు వెల్లడించారు. సదరు వీలునామాలో రామోజీ పేర్కొన్న అంశాలు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉంటమే కాదు.. సంస్థల్ని నడిపించే వారికి ఒక కరదీపికలా ఉంటుందని చెప్పాలి. ఈనాడులో పని చేసే ఉద్యోగులంతా సదరు సంస్థ తమ సొంతంగా ఎందుకు ఫీల్ అవుతారన్న దానికి తాజా వీలునామా చదివితే విషయం అర్థమవుతుంది. వీలునామాలో పెద్దదిగా ఉండటంతో అందులోని ముఖ్యాంశాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం.

  • “నా జీవన గగనంలో మబ్బులు ముసురుకుంటున్నాయి. విశ్వ కవి రవీంద్రుడు వాన కురవడానికో.. తుపానై విరుచుకుపడటానికో కాదు.. నా మలి సంధ్యకాశానికి కొత్త రంగులు అద్దటానికి’ అన్నట్లుగా .. ఇప్పుడు నాకు ఆయన మాటలు గుర్తుకు వస్తున్నాయి. దశాబ్దాలుగా కర్మసాక్షి తొలి వేకువ కిరణాల్లోని చైతన్యస్ఫూర్తిని అనునిత్యం గుండెల్లో పొదుపుకొని.. సప్తాశ్వ రథారూఢని కాలగమన వేగంతో సృజన పౌరుషానికి పదును పెట్టుకొని.. తరాల అంతరాలు తెలియనంత నిరంతర శ్రామికుడిగా పరుగులు పెట్టిన నాకు ఇప్పుడు విశ్వకవి మాటలు గుర్తుకు వస్తున్నాయి.
  • ముదిమి మీద పడినా.. మార్పు నిత్యం.. మార్పుసత్యం అని ఘోషించే నా మదిలో నవ్యాలోచనల ఉరవడి పోటెత్తుతూనే ఉంది. ఎప్పుడు ఏ తీరో.. ఏ నాటికి ఏ తీరమో తెలియని వార్ధక్యాన్నీ సార్థక్యం చేసుకోవాలన్న తపనే.. రామోజీ గ్రూపు కుటుంబ పెద్దగా మీ అందరిని ఉద్దేశించి ఈ లేఖ రాయటానికి నన్ను ప్రేరేపించింది.
  • ఒక విధంగా ఇది భవిష్య ప్రణాళిక. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బందిగా మీ అందరికీ బృహత్ లక్ష్యాల కరదీపిక. వ్యక్తికి బహువచనం శక్తి. రామోజీ గ్రూప్ సంస్థలన్నీ నా ఆలోచనల అంకురాలే. అయినా.. కోట్లాది జనవాహిని ప్రీతిపాత్రమైన శక్తిమంత వ్యవస్థలుగా అవన్నీ ఎదిగి రాజిల్లుతున్న ఘనతలో.. వ్యక్తిగా, వ్యష్టిగా మీరు యావన్మందీ వృత్తి నిబద్ధతతో చేసిన కృషి ఎంతో ఉంది.
  • ఆయా సంస్థల అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్రధారులై వృత్తిగత విలువలకు అంకితమై సంస్థ పేరే ఇంటిపేరుగా సమాజంలో పేరెన్నికగన్న ఉద్యోగులు ఎందరో నాకు తెలుసు. రామోజీ గ్రూపు సంస్థల్లో పని చేయటం ఉద్యోగ శ్రేణులకు ఎంత గౌరవమో.. మరెక్కడా లేని స్థాయి క్రమశిక్షణ.. సమయపాలన.. పని సామర్థ్యం.. అన్నింటినీ మించి సంస్థతో మమేకమయ్యే విశిష్ట లక్షణం గల సిబ్బంది ఉండటం నాకు గర్వకారణం.
  • కృషితో నాస్తి దర్భిక్షం.. ఇది దశాబ్దాలుగా నేను త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్న వ్యాపార సిద్ధాంతం. నా సంస్థలన్నీ ప్రజా ప్రయోజనాలతో నేరుగా ముడివడి.. విస్తృత మానవవనరుల వినియోగంతో జతపడి.. పని ప్రమాణాలతో ఉన్నత విలువలకు పట్టం కడుతున్నాయి. నా ఆయన సాధనకు అండగా నిలిచిన యావత్ సిబ్బందికి కృతజ్ఞతాజంలి. చేసే పని.. చేపట్టే ప్రాజెక్టు ఏదైనా అద్వితీయంగా రాణించాలి. రెండో స్థానంలో సర్దుకోలేకపోవటం నా జీవలక్షణం.
  • ఆ తపనతోనే జీవితమనే కొవ్వొత్తిని రెండువైపులా వెలిగించి మార్గదర్శి మొదలు ఈటీవీ భారత్ వరకు అన్నింటినీ అత్యుత్తమంగా తీర్చిదిద్దటానికి.. తెలుగుజాతి కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేయటానికి అక్షరాల నేను చేసింది అసిధారా వ్రతం.
  • నేను నిర్మించిన సంస్థలు.. వ్యవస్థలు కలకాలం నిలవాలన్నదే నా ఆకాంక్ష. ప్రత్యక్షంగా పాతికవేల మంది ఉపాధికి.. పరోక్షంగా మరో పాతిక వేల మంది జీవన భుక్తికి ఆధారభూతమైన రామోజీ గ్రూప్ సంస్థల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇచ్చేలా పటిష్ఠ యాజమాన్య.. మార్గదర్శక పునాదుల్ని సిద్ధం చేశాను.
  • నా తదనంతరం కూడా సమున్నత సంప్రదాయాలు సర్వదా కొనసాగి.. రామోజీ సంస్థల ఖ్యాతి ఇంతలంతలయ్యేలా మీరంతా విద్యుక్త ధర్మానికి నిబద్ధమవ్వాలని కోరుకుంటున్నాను. నా అన్ని విజయాల్లో నా సైన్యం మీరు. రామోజీ ఉద్యోగులంటేనే క్రమశిక్షణకు మారు పేరు. ఇక ముందూ.. మీ ఉద్యోగం సంస్థతో అనుబంధంగా ఒదిగి.. స్వామికార్యం స్వకార్యంలా ఉద్యోగ సోపానంలో ఎదిగి.. సృజన శక్తితో సవాళ్లను అధిగమించి.. రామోజీ గ్రూప్ దిగ్విజయ యాత్ర అప్రతిహతమయ్యేలా ప్రతి ఉద్యోగీ ఒక సమర్థ నిబద్ధ సైనికుడిగా కదలాలి. చెదరని నమ్మకానికిరామోజీ గ్రూప్ సంస్థలే చిరునామా. దాన్ని నిలబెట్టాల్సిన కర్తవ్యాన్ని మీపై మోపుతూ.. ఇది నేను రాస్తున్న బాధ్యతల వీలునామా.