షేకింగ్ : మేజిక్ ఫిగ‌ర్ చేరుకున్న టీడీపీ కూట‌మి!

ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఓటింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియలో తొలి మూడు రౌండ్లు ముగిసేనాటికి అద్భుతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు అస‌వ‌రమైన‌.. మేజిక్ ఫిగ‌ర్ 88 స్థానాలు. వీటిలో తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి 96 స్థానాల్లో కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వీటిలో టీడీపీ ఒంటరిగా 81 స్థానాల్లోనూ.. జ‌న‌సేన 11, బీజేపీ 5 స్థానాల్లోనూ దూకుడుగా ఉన్నాయి.

దీంతో కూట‌మి మేజిక్ ఫిగ‌ర్ దాటేసింది. అయితే.. ప్ర‌స్తుతం జ‌రిగిన 3 రౌండ్ల‌లో నే ఫ‌లితం వెల్ల‌డైంది. అదేస‌మయంలో మ‌రో 12 రౌండ్ల వ‌ర‌కు కౌంటింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఐదు రౌండ్లు అయ్యే స‌రికి ఒక నిర్ణ‌యం తెలుస్తుంది. కానీ, మారే విష‌యానికి వ‌స్తే.. చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా సీమ‌లో వైసీపీ వెనుక బ‌డిపోయింది. దీంతో కూట‌మి దూకుడు క‌నిపిస్తోంది.

ఇక‌, ఓటింగ్ శాతం విష‌యానికి వ‌స్తే.. టీడీపీ కూట‌మికి 51.26 శాతం ఓట్ల శాతం క‌నిపిస్తోంది. వైసీపీకి 41 శాతం ఓటింగ్ క‌నిపిస్తోంది. మూడు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి 10 శాతానికి పైగా ఓట్ల తేడా క‌నిపిస్తోంది. అదేవిధంగా కీల‌క‌మైన‌… సీమ ప్రాంతంలో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతోంది. మ‌రోవైపు కూట‌మి పార్టీలు సీమ‌లోనూ దూసుకుపోతున్నాయి. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూట‌మి పార్టీలు ముందంజ‌లో ఉన్నాయి. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే… కూట‌మి అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌రమైన అన్ని స్థానాల్లోనూ ముందంజ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.