వర్మ విషయంలో టీడీపీ ఇంకాస్త జాగ్రత్తగా వుండాల్సిందే

ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్.! లక్ష మెజార్టీకి అస్సలేమాత్రం తగ్గకూడదంటూ ఇటీవలే పార్టీ శ్రేణులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ‘టీ టైమ్’ సంస్థ అధినేత తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుని ఖరారు చేసే క్రమంలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలవాలని జనసేన అధినేత వ్యాఖ్యానించారు.

రాజకీయ ప్రత్యర్థులు ఓటుకి లక్ష ఖర్చు పెట్టడానికైనా సిద్ధమయ్యారు, అయినాగానీ మెజార్టీ లక్షకు తగ్గకూడదు.. అంటూ తనదైన డిక్షన్‌తో పవన్ కళ్యాణ్ చెప్పిన పొలిటికల్ డైలాగ్ వైరల్ అయ్యింది. ఇంకోపక్క, ఎలాగైనా జనసేనని ఓడించేందుకు అధికార వైసీపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

వైసీపీతో రాజకీయ పోరు ఓ వైపు జనసేన చేస్తుండగా, ఇంకో వైపు టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నుంచి జనసేనకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. బతిమాలుకుంటే పవన్ కళ్యాణ్‌కి పిఠాపురం టిక్కెట్ ఇచ్చింది టీడీపీయేననీ, పవన్ కళ్యాణ్ గెలిచినా, టీడీపీ కనుసన్నల్లో పని చేయాల్సిందేనని వర్మ చెప్పినట్లుగా మీడియాలో కథనాలు దర్శనమిచ్చాయి.

నిజానికి, వర్మ కొంచెం మాట తూలుతున్నారు. టిక్కెట్ తనకు దక్కలేదన్న అసహనం ఆయనది. అయినాగానీ, అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గుంబనంగా వ్యవహరించాల్సి వస్తోంది. అవకాశం వచ్చినా, రాకున్నా.. అవకాశం కల్పించుకుని, సన్నిహితుల వద్ద వర్మ చేస్తున్న వ్యాఖ్యలు, మీడియాకి లీక్ అవుతున్నాయి. అది కూడా వైసీపీ అనుకూల మీడియాకి.

ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న డ్యామేజీని టీడీపీ అధినాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. ‘మీ భార్య భారతి రెడ్డి రాసే అబద్ధాలని మీ చెల్లి చీ కొట్టింది జగన్.. అలాంటిది ఏపీ ప్రజలు ఎలా నమ్ముతారని అనుకున్నావ్.?’ అంటూ ట్వీటేసిన టీడీపీ, ‘పవన్ కళ్యాణ్ గారి జనసైనికులకి తోడుగా, పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది..’ అంటూ పేర్కొంది. ‘కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది. అది పూడ్చుకో ముందు. సీఎం సీటుతోపాటు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్..’ అంటూ ఎద్దేవా చేసింది టీడీపీ, ట్విట్టర్ వేదికగా.

సో, ఇక్కడికి కాస్త డ్యామేజ్ కంట్రోల్ అయినట్లే. కానీ, వర్మ విషయంలో టీడీపీ ఇంకాస్త జాగ్రత్తగా వుండాల్సిందే. లేనిపక్షంలో వర్మ వ్యవహారం టీడీపీ – జనసేన పొత్తుకు తీవ్ర ఇబ్బందులు ముందు ముందు కలిగించొచ్చు.