‘మీరు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చా.. ఆశీర్వ‌దించండి’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారి పేర్ల‌ను విడుద‌ల చేశారు. గ‌తంలోనే తొలి జాబితా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు అప్ప‌ట్లో 94 మంది అభ్య‌ర్థుల‌ను ఏక‌బిగిన విడుద‌ల చేసేశారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన పొత్తుల్లో భాగంగా టీడీపీకి దక్కిన 144 స్థానాల్లో మిగిలిన 50 సీట్ల‌కు సంబంధించి 34 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో కొంద‌రు వార‌సుల‌కు కూడా టికెట్లు కేటాయించారు. అదేవిధంగా కురువృద్ధుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆశ‌లు ఫ‌లించేలా చేశారు.

అదేవిధంగా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డికి ఆత్మ‌కూరు టికెట్‌ను కేటాయించారు. వెంక‌ట‌గిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ కోడలు కురుగొండ్ల ల‌క్ష్మీప్రియ‌కు అప్ప‌గించారు. మొత్తానికి ఆశావ‌హుల‌కు నిరాశ క‌ల‌గ‌కుండా చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గానే రెండో జాబితాను ఎంపిక చేశారు. ఇదిలావుంటే.. జాబితాను ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్యలు చేశారు.

మీరు చెప్పిన వారికే, మీ అభిప్రాయం మేర‌కే టికెట్లు ఇచ్చాన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల స‌ర్వే ఆదారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశాన‌ని, ఇప్ప‌టికే తొలిజాబితాను ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. మ‌రో 34 మందితో రెండో జాబితాను విడుద‌ల చేశామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ జాబితాలోనూ ప్ర‌జ‌ల అభి ప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. వీరిని ఆశీర్వ‌దించి.. తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్థు ల‌ను గెలిపించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.