‘మా ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉంది’

అందరిలా మాట్లాడితే ఆయన ధర్మాన ఎందుకు అవుతారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో నిలిచే ఆయన తాజాగా అదే తరహాను మరోసారి ప్రదర్శించారు. తమ ప్రభుత్వంపై మగాళ్లు కోపంగా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓవైపు తమ ప్రభుత్వంపై ఎవరికి ఎలాంటి గుర్రు లేదని.. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారని.. 175 స్థానాలకు 175 స్థానాలు ఖాయమన్న ధీమాను అధినేతతో సహా పలువురు నేతలు వ్యక్తం చేస్తుంటే.. అందుకు భిన్నంగా మగాళ్లు తమ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారంటూ సీనియర్ నేత కం మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇంతకూ వైసీపీ సర్కారు మీద మగాళ్లు ఎందుకంత కోపంగా ఉన్నారన్న దానిపై ఆయన వివరణ ఇస్తూ.. ‘‘ప్రతి అవసరానికి భార్యలను డబ్బులు అడగాల్సి రావటమే కారణం. అందుకే వారు వచ్చే ఎన్నికల్లో సైకిల్ కు ఓటేయాలని అంటారు. మీరు వారి మాటల్ని వినకండి. పథకాలు ఇచ్చినందుకు వైసీపీకి ఓటు వేసి గెలిపించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. మహిళల్ని అకట్టుకోవటానికి మాట్లాడే క్రమంలో మగాళ్లకు మండేలా మాట్లాడటంలో అర్థమేంటి మంత్రివర్యా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో ఆయన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సభకు హాజరైన మహిళల్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో మీరు అధికారం ఇచ్చారు. మీరు ఓట్లేసి అధికారం ఇచ్చి ఐదేళ్లు అవుతోంది. ప్రభుత్వ పథకాల పంపిణీ వేళ మిమ్మల్ని పలుమార్లు కలిశాను. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అధికారిక కార్యక్రమం. మరో రెండు.. మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వీలుంది. తర్వాత అధికారులతో ఏర్పాటు చేసే సమావేశాలు ఉండవు’ అంటూ చెప్పిన ధర్మాన.. మహిల్ని ఆకట్టుకునే క్రమంలో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.