బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉంది: చంద్రబాబు

బీసీలకు రాజ్యాధికారం రావాలని కలలుగన్న విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావును స్మరించుకుంటూ జయహో బీసీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు ఇది అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాయని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. బీసీల బాగు కోసం తాను, పవన్ ఇద్దరం కలిసి పనిచేస్తున్నామన్నారు.

40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని చెప్పారు. అందుకే బీసీల రుణం తీర్చుకోవాలి అని, ఈ క్రమంలోనే 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకు వచ్చామని చెప్పారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.

బీసీ కార్పొరేషన్ల పేరుతో జగన్ దొంగ లెక్కలు చూపించి ఎక్కడ నిధులు దొరికితే అక్కడ దొడ్డిదారిన మళ్లించారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. టీడీపీఆధ్వర్యంలోనే బీసీలకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25 శాతానికి రిజర్వేషన్లు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన-తెలుగుదేశం కూటమిని గెలిపించాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఒకవేళ బీసీలలో ఎవరికైనా రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే వారికి సముచిత స్థానాన్ని కేటాయించి నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత తనదని అన్నారు. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయకూడదన్న చట్టాన్ని టీడీపీ-జనసేన కూటమి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. జగన్ పాలనలో 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారనిి, వేలాదిమంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాజకీయంగా బీసీ వర్గాలను అణిచివేసే ధోరణిని సహించబోమని, అందుకే బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని అన్నారు.

ఎస్సీలకు ఎస్సీలకు ఏ విధంగా ఉందో రక్షణ చట్టం ఉందో… బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబడ్దార్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీల కోసం కనీసం 10 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. బీసీలు పరిశ్రమలు పెట్టాలన్న, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా ఆదుకుంటామని అన్నారు. జగన్ తీసివేసిన విద్యా పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తామన్నారు. జీవో నంబర్ 217 ను రద్దు చేస్తామన్నారు.

బీసీ డిక్లరేషన్ లో 10 పాయింట్లు

  1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
  2. పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
  3. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  4. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
  5. బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు… సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
  6. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ
  7. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
  8. అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్… కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
  9. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు… జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
  10. బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు… రూ.5 వేల కోట్లతో ‘ఆదరణ’ పరికరాలు