భారమంతా చంద్రబాబుదేనా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వీటిల్లో నాలుగు స్ధానాల్లో అసమ్మతి అట్టుడికిపోతోంది. అసమ్మతి నేతలతో మాట్లాడటం, బుజ్జగించటం, దారికి తెచ్చుకోవటం అభ్యర్ధుల వల్లే అయ్యేట్లు లేదు. అందుకనే అసమ్మతి నేతలతో మాట్లాడి దారికితెచ్చే బాధ్యతలు నలుగురు అభ్యర్థులు చంద్రబాబుపైనే పెట్టేశారు. విషయం ఏమిటంటే కల్యాణదుర్గం, శింగనమల, మడకశిర, పెనుకొండలో అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యతిరేక వర్గాలు రెచ్చిపోతున్నాయి. దాంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

పెనుకొండలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ బీకే పార్ధసారధిని కాదని సవితకు టికెట్ ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని బీకే వర్గీయులు పార్టీ ఆఫీసుమీద దాడిచేసి ధ్వంసంచేశారు. పార్టీ ఆఫీసులోని కటౌట్లను, బ్యానర్లు, జెండాలను తగలబెట్టేశారు. పార్టీ ఆఫీసుకు తాళాలు కూడా వేసేశారు. సవిత పార్ధసరాధితో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక శింగనమలలో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వటాన్ని ఆమె వ్యతిరేకులు తట్టుకోలేకపోతున్నారు. జిల్లా కార్యాలయంపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. పోయిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన శ్రావణికి మళ్ళీ టికెట్ ఇస్తే సానుభూతి ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన.

కల్యాణదుర్గంలో కన్ స్ట్రక్షన్ కంపెనీ అధినేత సురేంద్రబాబుకు టికెట్ కేటాయించారు. ఈయన పార్టీలో కొత్త కాకపోతే ఆర్ధికంగా స్తితిమంతుడు. ఇప్పటికే మాజీ ఎంఎల్ఏ ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వరనాయుడు టికెట్ కోసం పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లో ఇలాగే పోటీపడినా ఉమాకే టికెట్ దక్కింది. దాంతో ఉన్నం సహకరించకపోవటంతో ఉమ ఓడిపోయారు. ఇపుడు కూడా అలాగే గొడవలవుతాయనే మధ్యేమార్గంగా చంద్రబాబు కొత్త అభ్యర్ధికి టికెట్ ఇచ్చారు.

తామిద్దరినీ కాదని చంద్రబాబు కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వటంతో అభ్యర్ధికి వ్యతిరేకంగా రెండు వ్యతిరేక గ్రూపులు ఏకమయ్యాయి. ఇక మడకశిరలో మాజీ ఎంఎల్ఏ ఈరన్న, తిప్పేస్వామి టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఈరన్న కొడుకు సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించారు. దాంతో తిప్పేస్వామి మద్దతుదారులు మండిపోతున్నారు. టికెట్ వచ్చింది కాబట్టి మద్దతు కోరేందుకు ఈరన్న, సునీల్ తిప్పేస్వామి ఇంటికి వెళ్ళినపుడు మద్దతుదారులు చెప్పులతో దాడిచేసి తరిమేశారట. దాంతో పై నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతలను అభ్యర్ధులు చంద్రబాబు మీదే పెట్టేశారట. మరి చంద్రబాబు వీళ్ళతో ఎప్పుడు మాట్లాడుతారో వీళ్ళెపుడు దారికివస్తారో చూడాలి.