ఒత్తిడి పెరిగిపోతోందా ?

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కొద్ది బీజేపీ ఏపీ చీఫ్  దగ్గుబాటి పురందేశ్వరిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. టీడీపీ, జనసేనతో పొత్తుంటుందో ఉండదో ఆమె చెప్పలేకపోతున్నారు. అధికారికంగా బీజేపీ, జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ ఆచరణలో మాత్రం అది కనబడటంలేదు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పొత్తు కుదుర్చుకున్నారు. సీట్ల సర్దుబాటు కూడా మొదలైపోయింది. కాబట్టి మాకు జనసేన మిత్రపక్షమే అని పురందేశ్వరి చెప్పేదంతా ఉత్త సొల్లు మాత్రమే అని అందరికీ తెలుసు.

అందుకనే టీడీపీ కూటమితో బీజేపీ కలుస్తుందా కలవదా అన్న విషయంలో అయోమయం పెరిగిపోతోంది. నిజానికి ఇంత అయోమయం అవసరమే లేదు. అయితే మొన్నటి 6వ తేదీన సడెన్ గా పొత్తు చర్చలకు ఢిల్లీకి  రమ్మని అమిత్ షా నుండి చంద్రబాబుకు కబురు వచ్చింది. వెంటనే చంద్రబాబు కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది ఎవరికీ తెలీదు. పొత్తును ఫైనల్ చేస్తానని పదేపదే చెప్పిన పవన్ కూడా ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు. దాంతో రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన వచ్చేసింది.

కొద్దిరోజులు బీజేపీ కోసం వెయిట్ చేసిన చంద్రబాబు, పవన్ సడెన్ గా సీట్ల సర్దుబాటును ప్రకటించేశారు.  రెండు పార్టీల తరపున పోటీచేయబోయే 99 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు.  దాంతో పొత్తు విషయం తేల్చుకోవాల్సిన అవసరం బీజేపీపైన పడింది. మీడియాతో పాటు పార్టీలోని నేతలు కూడా పదేపదే పొత్తు విషయాన్ని పురందేశ్వరిని అడుగుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పలేక, అగ్రనేతలతో  దీనిపై మాట్లాడలేక ఆమె నానా అవస్థలు పడుతున్నారు.

దాని ఫలితంగానే పురందేశ్వరిపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నా అగ్రనేతలేమో పొత్తుపై ఏమీ తేల్చకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. 27వ తేదీన అంటే మంగళవారం ఏలూరులో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్న కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏమన్నా క్లారిటి ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. నిజానికి రాజ్ నాధ్ కు ఏపీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా ఢిల్లీ నుంచి వస్తున్నారు కాబట్టి అమిత్ షా నుండి ఏమన్నా సంకేతాలు తెస్తారా అని అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.