జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి- ష‌ర్మిల మ‌రో పిలుపు

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా మ‌రో పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని ఆమె తెలిపారు. తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ నిరంకుశ ధోర‌ణిని ప్ర‌తి ఒక్క‌రూ గ‌మ‌నించాల‌ని అన్నారు. మెగా డీఎస్సీ కోసం ఉద్య‌మిస్తున్న విద్యార్థుల‌ను ప‌ట్టించుకోకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్ర‌శ్నించారు.

మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ దగా డీఎస్సీ ఇచ్చారని ష‌ర్మిల మండిపడ్డారు. వైఎస్ వారసత్వం అంటే ఇదేనా. మహిళనని కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌లో ఉంచారని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి గాయమైందని తెలిపారు. ఈ రోజు తన పరిస్థితిని చూసి తన తండ్రి దివంగత రాజశేఖర్‌‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎస్సీ విష‌యంలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయ‌కుల‌ను వెంట‌నే విడిచి పెట్టాల‌ని.. లేక పోతే.. శుక్ర‌వారం జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డికి పిలుపునిస్తామ‌ని ష‌ర్మిల పిలుపునిచ్చారు. సచివాలయంలో వినతి పత్రం ఇద్దామని వస్తే ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి ఎందుకు రారని ప్రశ్నించారు.

చివరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా సచివాలయంలో ఉండరని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఏపీలో అసలు పరిపాలన లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కాపాడట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌క్షాన తాను పోరాటం చేసి తీరుతాన‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపుతాన‌న్నారు.