బీఆర్ఎస్‌కు ఏమైంది?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీలో పెను కుదుపులు చోటు చేసుకున్నాయి. ఒక‌రు వెంట ఒక‌రుగా.. పార్టీ నాయ‌కులు జంప్ చేసేస్తున్నారు. ముహూర్తం పెట్టుకుని మ‌రీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. వీరిలో చోటా మోటా నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడితే.. మాజీ మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌రో 20 రోజుల్లో షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ జంపింగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అయితే.. బీఆర్ ఎస్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో బీఆర్ ఎస్‌లో ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది.

కేసీఆర్ బల‌హీనుల‌వుతున్నారా?

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. నాయ‌క‌త్వ‌మే ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని నిల‌బెట్టింద‌నేది వాస్త‌వం. దీనిలో రెండో మాటకు అవ‌కాశం లేదు. అయితే.. గ‌త రెండేళ్ల కాలం నుంచి ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే.. ఆయ‌న కుమార్తె క‌విత‌పై లిక్క‌ర్ కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత నుంచి కేసీఆర్ డ‌ల్ అయ్యారు. అంత‌కు ముందు ఉన్న గ‌ళం.. దూకుడు త‌గ్గించారు. దేశాన్ని ఏకం చేస్తాన‌ని.. మోడీని గ‌ద్దె దించుతాన‌ని చెప్పిన కేసీఆర్‌.. అనూహ్యంగా ఆ దారి త‌ప్పి.. రాష్ట్రానికే ప‌రిమితం అయ్యారు. అంతేకాదు.. పొరుగున ఉన్న ఏపీలో కూడా పోటీ చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న త‌ర్వాత‌.. మెత్త‌బ‌డ్డారు. ఈ ప‌రిణామాలకు తోడు.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. దీంతో కేసీఆర్ హ‌వా త‌గ్గుతూ వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

పుంజుకున్న రేవంత్‌..

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీ అధికారంలోకి తీసుకురావ‌డంలో స‌క్సెస్ అయ్యారు. బొటాబొటి మెజారిటీనే ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ.. అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలు.. రేవంత్‌ను ఐకాన్‌గా నిల‌బెడుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఆయ‌న స‌క్సెస్ రేట్ తారా జువ్వ‌లా పుంజుకుం ద‌నే అభిప్రాయం ఉంది. ఈ నేప‌థ్యానికి తోడు.. కేసీఆర్ పాల‌న‌లోని లొసుగులపై అసెంబ్లీ వేదిక‌గా విజృంభిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ స‌హా రేవంత్ గ్రాఫ్ పెరిగింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిణామాల‌తోనే బీఆర్ ఎస్ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇంత జ‌రుగుతు న్నా..కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ.. మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల నాటికి ఈ జంపింగులు మ‌రింత పుంజుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలావుంటే.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తనకు బీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్ పి చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కూడా కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్లే నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.