షర్మిల టార్గెట్టంతా వైసీపీయేనా ?

కొత్తగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ముందు చాలా పెద్ద బాధ్యతలే ఎదురుచూస్తున్నాయి. అవేమిటంటే పార్టీని బలోపేతం చేయటం, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఉనికి చాటుకునేట్లు చేయటం. మామూలు పరిస్ధితుల్లో అయితే పై రెండు సాధ్యమయ్యేది కాదు. 2014లో  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్ధాపితమైపోయింది. కోమా స్టేజిలో ఉన్న పార్టీని లేపటం ఎవరివల్లా కావటం లేదు. జనాలు కూడా కాంగ్రెస్ ను పట్టించుకోవటం మానేశారు.

ఈ నేపద్యంలో తొందరలో మూడో ఎన్నిక జరగబోతున్న సమయంలో వైఎస్ షర్మిల పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. షర్మిలకు వ్యక్తిగతంగా జనాల్లో ఎలాంటి గుర్తింపు లేదన్నది వాస్తవం. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురిగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా పాపులర్ అనే చెప్పాలి. అందుకనే షర్మిల కాంగ్రెస్ లో చేరగానే అద్భుతాలు జరిగిపోతాయని కొందరు అనుకుంటున్నారు. దానికి హేతువు ఏమిటంటే షర్మిల టార్గెట్ అంతా వైసీపీ మీదే ఉండటం. దీనికి కారణం ఏమిటంటే అన్నా-చెల్లెలుకు ఏమాత్రం పడకపోవటమే.

అందుకనే షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోగానే వైసీపీలోని అసంతృప్త ఎంఎల్ఏలు, నేతలు పార్టీని వదిలేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంఎల్ఏలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తాము కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకెంతమంది చేరుతారో తెలీదు.  టికెట్లు దక్కని వైసీపీ లేదా టీడీపీలోని అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా కాంగ్రెస్ బలోపేతమైపోతుందని అనుకుంటున్నారు. సో, పార్టీని బలోపేతం చేయటం కోసమే షర్మిల తన టార్గెట్ ను వైసీపీ మీదే పెడుతుందనటంలో సందేహం లేదు.

ముందుగా అసంతృప్తులను లాక్కుంటే వాళ్ళకి టికెట్లు ప్రకటించటం ద్వారా కాంగ్రెస్ ను జనాల్లోకి తీసుకెళ్ళాలన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ తరపున పోటీచేస్తారని కాని, ప్రచారం చేసుకుంటున్నారని కాని చెప్పుకునేందుకు ఒక్కరంటే ఒక్క నేత కూడా లేరు. ఉండటానికి పార్టీలో తులసిరెడ్డి, హర్షవర్ధన్, చింతామోహన్, జేడీ శీలం, పళ్ళంరాజు లాంటి పెద్ద పెద్ద లీడర్లున్నారు. కానీ వీళ్ళు పోటీచేసి కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు. మరి షర్మిల టార్గెట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.