అఫీషియల్.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు

కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు, ప్రచారాన్ని నిజం చేస్తూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టుగా వేణుగోపాల్ ప్రకటించారు. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ చేసేందుకు 2 రోజుల క్రితం గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.

దీంతో, దాదాపుగా ఆ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారంలోకి వచ్చింది. దీంతో, ఏపీలో కూడా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది. దాంతోపాటు, వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలందరూ టీడీపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతోనే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.