ప్రతిపక్షాలకు రేవంత్ షాకివ్వబోతున్నారా ?

లోక్ సభ ఎన్నికలకు ముందే రెండు భారీ హామీలను అమల్లోకి తేవటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ ఆరు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ గెలుపులో ఈ ఆరుహామీలు కూడా కీలకపాత్ర పోషించాయి. వీటి అమలుకు వంద రోజులను పార్టీ గడువుగా పెట్టుకున్నది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే హామీలన్నింటినీ అమలుచేస్తామని రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించారు.

అధికారంలోకి రాగానే రెండు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ  పరిదిని రు. 10 లక్షలకు పెంచింది. ఇంకా నాలుగు హామీలున్నాయి. ఇందులో రు. 500 కే ఉచిత గ్యాస్ సిలిండర్, రైతులకు రు. 2 లక్షల వరకు రుణమాఫి, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు చాలా ముఖ్యమైనవి. గ్యాస్ సిలిండర్ పథకంపై అధికారులు విధి విధానాలను అధ్యయనంచేస్తున్నారు. దీనికి అదనంగా రుణమాపి, ఫ్రీ కరెంటు పథకాల అమలుకు కూడా ఉన్నతాధికారులు, నిపుణులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఈ మూడు హామీలను పార్లమెంటు ఎన్నికల్లోపు అమల్లోకి తేవాలని రేవంత్ గట్టిగా అనుకున్నారట. మూడు హామీలను గనుక అమల్లోకి తెచ్చేస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజి వస్తుందని అనుకుంటున్నారు. 17 పార్లమెంటు సీట్లలో హైదరాబాద్ వదిలేసి మిగిలిన 16 సీట్లను కచ్చితంగా గెలుచుకోవాల్సిందే అని రేవంత్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. పార్లమెంటుకు పోటీచేయాల్సిన అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తిచేశారు.

అభ్యర్ధుల జాబితాతో పార్టీ అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతున్నారు. ఎంపీ అభ్యర్ధులను ప్రకటించేసి, మూడు హామీల అమలుకు తేదీలను ప్రకటించేసి ఎన్నికల ప్రచారంలోకి దిగాలన్నది రేవంత్  ఆలోచన. హామీలను అమల్లోకి తెస్తే పార్టీ గెలుపుకు తిరుగుండదని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకనే వీలైనంత తొందరలోనే పార్టీ పెద్దలతో ఎంపీ అభ్యర్ధుల జాబితాపై ఆమోదముద్ర వేయించుకోవాలని చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ హామీల అమలు దూకుడును బీఆర్ఎస్, బీజేపీలు ఎలా ఎదుర్కుంటాయో చూడాల్సిందే.