చంద్రబాబు బీసీ మార్క్

తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్ధుల్లో ఎక్కువగా బీసీ నేతలను ఎంపిక చేయాలని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారు. బలమైన బీసీ నేతల కోసం అన్వేషణ తీవ్రమైంది. ఎప్పటినుండో బలమైన అభ్యర్ధుల కోసం చంద్రబాబు వెతుకుతున్నారు. వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం కూడా ఇదే పనిలో నిమగ్నమైంది. ఎన్నికలు మహాయితే మరో మూడునెలల్లో జరగబోతోంది. అందుకనే ఇపుడు అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబు స్పీడు పెంచారు. 25 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని కేటాయిస్తారన్నది సస్పెన్సుగా మారింది.

పొత్తులో టీడీపీ ఐదు సీట్లను వదులుకోవాల్సుంటందని అనుకున్నా మిగిలిన 20 సీట్లకు అభ్యర్ధులను పోటీలోకి దింపాల్సిందే. ఇందులో తక్కువలో తక్కువ 10 సీట్లలో బలమైన బీసీ అభ్యర్ధులను పోటీలోకి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, రాయలసీమలోని రాజంపేట, హిందుపురం, అనంతపురం, నరసరావుపేట, గుంటూరు లాంటి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధుల కోసం సర్వేలు జరుగుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇపుడు టీడీపీకున్న ముగ్గురు సిట్టింగ్ ఎంపీల స్ధానాల్లో కూడా కొత్తవారిని దింపాల్సిందే.

విజయవాడలో కేశినేనిని పార్టీ నుండి బహిష్కరించారు. ఇక్కడ ఆయన తమ్ముడు కేశినేని శివధర్ ను పోటీచేయిస్తారని సమాచారం. గుంటూరులో కొత్త అభ్యర్ధిని చూసుకోవాలి. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రాబోయే ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు. ఎంపీగా పోటీచేసే ఆసక్తిలేదని ఎంఎల్ఏగానే చేస్తానని చంద్రబాబుకు చెప్పేశారట. కాబట్టి పొత్తులో వదిలేసిన సీట్లను మినహాయిస్తే మిగిలిన అన్నీ చోట్లా కొత్త అభ్యర్ధులను పోటీ చేయించాల్సిందే.

ఎలాగూ కొత్త అభ్యర్ధులను పోటీచేయించాలి కాబట్టి బలమైన బీసీలను రంగంలోకి దింపితే క్యాస్ట్ ఈక్వేషన్లు బాగుంటాయని చంద్రబాబు భావిస్తున్నారు. సమాజంలో సగం జనాభా బీసీలే అన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమైనవి. కాబట్టి బీసీ కార్డును ఉపయోగించి మెజారిటి బీసీల ఓట్లను వేయించుకునేందుకు ప్లాన్ జరుగుతోంది. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే రాబిన్ బృందం బలమైన బీసీ అభ్యర్ధులపై వడపోత మొదలుపెట్టింది. మరి అభ్యర్ధులుగా చివరకు ఎవరుంటారో చూడాల్సిందే.