విద్యాంధ్ర‌గా ఏపీ.. దేశంలోనే ముందు: పీఎం ఆర్థిక స‌ల‌హా మండ‌లి నివేదిక‌

ఏపీ.. స‌రికొత్త రికార్డును సొంతం చేసుకుంది. క్షేత్ర‌స్థాయిలో విద్య‌ను అన్నివ‌ర్గాల వారికీ చేరువ చేయ‌డంలోనూ… నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలోనూ దేశంలో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు విద్య అంటే.. కేర‌ళ రాష్ట్రం స్ఫురించేది. ముఖ్యంగా నాణ్య‌మైన విద్య‌కు, న‌వీన విద్య‌కు కేర‌ళ కేరాఫ్‌గా ఉండేది. అయితే.. అలాంటి కేర‌ళ‌ను సైతం ఏపీ దాటుకుని.. ముందు నిల‌వ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన విద్యా సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా రాష్ట్రం ఈ ఘ‌న‌త సాధించడం విశేషం.

ఎవ‌రు చెప్పారంటే..

రాజ్యాంగం ప్ర‌కారం రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య విష‌యంలో ఆయా రాష్ట్రాలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి? విద్య‌ను ఎలా ప్రోత్స‌హిస్తున్నాయి? ఎలాంటి వ‌స‌తులు క‌ల్పిస్తున్నాయి? సంస్క‌ర‌ణ‌లు ఎలా ఉన్నాయి? అనే అంశాల‌పై ప్ర‌ధాన మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి(పీఎంఈఏసీ) అధ్య‌య‌నం చేసింది. పీఎంఈఏసీకి చైర్మ‌న్‌గా ప్ర‌ముఖ విద్యావేత్త డాక్ట‌ర్ బిబేక్ దేబ్రాయ్ వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో సాగిన‌ ఈ అధ్య‌య‌నం తాలూకు నివేదిక ‘స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా’ ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ నివేదిక‌లోనే ఏపీలో అమ‌ల‌వుతున్న సంస్క‌ర‌ణ‌ల‌ను, విద్యా విధానంలో దూసుకుపోతున్న తీరును ప్ర‌త్యేకంగా వివ‌రించారు.

మొత్తం 5 అంశాల‌పై

డాక్ట‌ర్ బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని పీఎంఈఏసీ కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన 5 అంశాల‌పై అధ్య‌య‌నం చేసింది. ఆయా అంశాల ను ఆయా రాష్ట్రాల్లో ఎలా అమ‌లు చేస్తున్నార‌నే తీరును తెలుసుకున్నాయి. వీటి ప్ర‌కారం రాష్ట్రాల‌కు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే ముందుండ‌డం గ‌మ‌నార్హం.

ఇవీ ఫ‌లితాలు..

  • అందుబాటులో విద్య‌ అనే అంశంపై జ‌రిగిన అధ్య‌య‌నంలో అక్ష‌రాస్య‌త‌, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్ప‌త్తి, గ్రామీణ ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు వంటి అంశాల‌పై ప‌రిశీల‌న చేశారు. ఈ విష‌యంలో ఏపీ 38.50 స్కోరుతో దేశంలో అగ్రస్థానంలో ఉంది.
  • అందుబాటులో విద్య అనే అంశంలో కేర‌ళ వెనుక‌బ‌డింది. ఏపీ క‌న్నా త‌క్కువ స్కోరు సాధించింది. ఈ విష‌యంలో కేర‌ళ కేవ‌లం 36.55 స్కోరు సాధించింది.
  • అందుబాటులో విద్య అనే అంశంలో రాజస్థాన్‌ 25.67, ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ 22.28, బీహార్‌ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి.
  • చిన్న రాష్ట్రాల్లో అనుస‌రిస్తున్న విద్యా విధానంలో.. కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చున‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది.
  • కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇత‌ర అంశాలు..

అధ్య‌య‌నంలో విద్యార్థుల కిండ‌ర్ గార్టెన్‌, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో గ‌మ‌నించారు. ఆయా విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చిన్న, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును వెలువరించారు.

  • ఫౌండేషన్‌ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున వాటిని వివరిస్తూనే నివేదిక‌లో ప‌లు అంశాల‌పై సూచ‌న‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.