తెలంగాణ‌లో సెగ పెంచిన `ఎమ్మెల్సీ ఎన్నిక‌`..

నిన్న మొన్న‌టి వ‌ర‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల వేడితో ర‌గిలిపోయిన తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఇది కేవ‌లం ఒకే ఒక్క‌స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌. అయిన‌ప్పటికీ.. రాజకీయ పార్టీల మ‌ధ్య వేడి రాజుకుంది. వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జనగామ నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

2021 మార్చిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా, 2027 ఏప్రిల్‌ వరకు ప‌ల్లాకు పదవీ కాలం ఉంది. అయితే, ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో ఎమ్మెల్సీని వ‌దులుకున్నారు. ఫ‌లితంగా ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో అధికారికంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోటీ చేయగా, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెస‌ర్‌ కోదండరాం, యువ తెలంగాణ తరఫున రాణి రుద్రమ దేవి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న తదితరులు బరిలో నిలిచారు.హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలుపొందారు.

ఇప్పుడు మారిన సీన్‌..

తాజాగా కాంగ్రెస్ పార్టీఅధికారంలోకి రావడం, గతంలో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్‌ మల్లన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఆయనే బరిలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు కోదండరాంకు  కూడా ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి గ‌తంలో హామీ ఇచ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు కోదండ రాం కూడా ఈ సీటుపై క‌న్నేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సెగ రాజుకున్న‌ట్ట‌యింది. ఎవ‌రికి ఈ టికెట్  ద‌క్కుతుందో చూడాలి.