ప్యాలెస్ కాలింగ్…వైసీపీ ఎమ్మెల్యేస్ షివరింగ్

2024 ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం జగన్ రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎటు చూసినా సరే ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను జగన్ మార్చిన వైనం మిగతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. మరో 45 మంది జాబితా సిద్ధంగా ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలు పదిలమో కాదో అని టెన్షన్ పడుతున్నారు.

తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు వస్తుందేమో అని కంగారు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పడంతో తమ నెంబర్ వస్తుందేమో అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ఖరారుపై ఈరోజు నుంచి మూడు రోజులు పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఎంపీ అభ్యర్థుల జాబితాపై సీఎం ఇదే తరహా సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఏ నిమిషంలో అయినా నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు గురించి అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు ప్యాలెస్ నుంచి పిలుపు రావడంతో వారు తమ కుర్చీలను అరచేతిలో పెట్టుకొని తాడేపల్లి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మంత్రి చెన్నుబోయిన వేణు గోపాల్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిలు కూడా సీఎంవోకు రావడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ అందరితో జగన్ వేర్వేరుగా భేటీ అవుతున్నారు.

వీరికి రాబోయే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తున్నారని, అందుకు గల కారణాలను జగన్ వివరిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, వారి స్థానంలో నియమితులైన అభ్యర్థులకు సహకరించాలని జగన్ చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే, టికెట్ దక్కని వారికి రాబోయే ఎన్నికల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని కూడా జగన్ హామీ ఇస్తున్నారని తెలుస్తోంది.