సిట్టింగ్‌ల‌ను మార్చేస్తే ప‌న‌వుతుందా? వైసీపీలో హాట్ టాపిక్‌!

రాజ‌కీయాల్లో మార్పులు స‌హ‌జం. ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్న‌వారి గ్రాఫ్‌ను ఆలంబ‌నగా చేసుకుని మార్పుల‌కు పార్టీలు శ్రీకారం చుడ‌తాయి. మ‌రో కొత్త నాయ‌కుడిని నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకువ‌స్తాయి. ఇది స‌హ‌జ‌మే. అయితే.. అన్ని వేళ‌లా ఈ మార్పులు చేసినా.. ఫ‌లించే అవ‌కాశం త‌క్కువ‌గానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగుల‌ను మార్చేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఎమ్మెల్యేల సంగ‌తి ఎలా ఉన్నా.. ఎంపీల విష‌యాన్ని తీసుకుంటే.. మార్పులు ఖాయ‌మ‌నే అంటున్నారు. వారే కోరుకుంటున్నా.. లేక పార్టీ అధిష్టానం కాదంటున్నా.. మొత్తానికి ఎంపీలుగా ఉన్న 22 మందిలో 12 మందిని మార్చేయ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. దీనికి మూడు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. వారు వ్య‌క్తిగ‌తంగా డీ మోర‌ల్ కావ‌డం. ప్ర‌జ‌ల‌తో ఛీ కొట్టించుకోవ‌డం. రెండు.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను గాలికి వ‌దిలేయ‌డం. మూడు.. పార్టీ నేత‌లు కాద‌ని బాహాటంగానే చెబుతుండ‌డం.

ఇలా.. ఈ మూడు కార‌ణాల‌తో 8 నుంచి 12 పార్ల‌మెంటు స్థానాల్లో మార్పులు త‌థ్య‌మ‌ని అంటున్నారు. వీటిలో హిందూపురం, విశాఖ‌, క‌ర్నూలు, రాజ‌మండ్రి, విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌వారే ఎక్కువ‌గా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ నాయ‌కుల‌తో నూ దూరంగా ఉంటున్నారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో తీరిక లేకుండా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

వీరిని మార్చితే త‌ప్ప‌.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లితం ఉండ‌బోద‌ని పార్టీ నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఓకే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, స‌ద‌రు నేత‌లు వేసిన‌.. బ్యాడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానిని చెరిపేయ కుండా.. వారిపై చ‌ర్య‌లు తీసుకుని ప్ర‌జ‌ల్లోకి సంకేతాలు పంపించ‌కుండా.. ఇప్పుడు వారి స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చినా.. ప్ర‌యోజనం లేద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ముందు.. వారిపై చ‌ర్య‌లు తీసుకుని ప్ర‌జ‌ల్లోకి గ‌ట్టి సంకేతాలు పంపాల‌ని త‌ర్వాత‌.. నాయ‌కుల‌ను మార్చాల‌ని కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.