ఎగ్జిట్ పోల్ సర్వే తప్పు…70 సీట్లు పక్కా: కేటీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ పోయడంతో సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వెల్లడైంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వేలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు పోలింగ్ పూర్తవ్వకుండానే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలని కేటీఆర్ కోరారు. కొన్ని జాతీయ సంస్థలు, కొన్ని మీడియా ఛానళ్లు, మరి కొన్ని సర్వే సంస్థలు నామమాత్రంగా కొన్ని శాంపిల్స్ తీసుకొని అదే ప్రజాభిప్రాయం అని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటాయని, ఆ పద్ధతి సరికాదని అన్నారు.

అయితే, ఫలితాలు తారుమారైతే ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుందన్న విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ పలితాలు సర్వేలకు ప్రతికూలంగా వస్తే ఏం చేస్తారని ఆయా సంస్థలనుద్దేశించి ప్రశ్నించారు. 2018 ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఈ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని, కానీ, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కన్నా ప్రజలనే ఎక్కువగా నమ్ముతామని, తమకు ఈ సారి 70కి పైగా స్థానాలు వస్తాయని అన్నారు. డిసెంబర్ 3వ తేదీన అందరూ ఫలితాలను చూస్తారని చెప్పారు.

ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ ఎన్నికల కోసం వారంతా చాలా కష్టపడ్డారని, వారందరికీ ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు.