ఇది ఘోరం.. సాగ‌ర్ వివాదంపై పురందేశ్వ‌రి ఫైర్‌


తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఉద్దేశ పూర్వ‌కంగానే వివాదం రేగిందో.. లేక నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే రాజుకుందో తెలియ‌దు కానీ.. సాగ‌ర్ వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఏపీ పోలీసులు.. అక్క‌డ మోహ‌రించ‌డం, ఇటు తెలంగాణ పోలీసులు కూడా రావ‌డం ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వివాదం రేగింది. మొత్తానికి ఈ విష‌యం తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ విష‌యంలో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి జోక్యం చేసుకున్నారు.

అంతేకాదు.. సీఎం జ‌గ‌న్‌పైనా ఆమె ఫైరయ్యారు. నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడం చాలా ఘోరం అన్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు. గతంలో ఏపీ, తెలంగాణ అధికారులు ఈ విషయంలో ఘర్షణ పడ్డారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తారా? అని దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే ఈ వివాదం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వం చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 400 మండలాల్లో కరవు విలయతాండవం చేస్తోంద‌న్న పురందేశ్వ‌రి.. ప్రభుత్వం మాత్రం కేవలం 100 మండలాల్లోనే కరువు ఉందని చెప్పడం రైతులను అవమానించడమేనని తెలిపారు. కరవు విషయంలో క్యాబినెట్‌లో కూడా చర్చ జరగకపోవడం శోచనీయం అన్నారు.

అసలు ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే ప్రజలు వెతుక్కుంటున్నారని పురందేశ్వ‌రి దుయ్యబట్టారు. అదే నీటిపారుదల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం చెబుతున్నారని మంత్రి అంబ‌టిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. సాగ‌ర్ వివాదం వెనుక ఎన్నిక‌ల కోణ‌మే ఉంద‌ని వ్యాఖ్యానించారు.