బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయా ?

తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫెయిలైనట్లే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ మీద మండిపోతున్న ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని డిసైడ్ చేశారు. ముస్లిం మైనారిటి సంఘం, జమాత్ ఏ హింద్ సంస్ధలు కాంగ్రెస్ కు మద్దతుగా ఓట్లేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ సంస్ధలు తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ కు షాకనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 119 నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 40 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం ఉంటుంది.

ఈ 40 నియోజకవర్గాల్లో కూడా సుమారు 20 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేసేంత స్ధాయిలో ముస్లింల ఓటింగ్ ఉంటుంది. ఇంతటి డిసైడింగ్ ఫ్యాక్టరైన ముస్లింలను దూరం చేసుకోవటమే కేసీయార్ తప్పు. తాము ముస్లింలను చాలా గొప్పగా చూసుకుంటున్నామని కేసీయార్, కేటీయార్, హరీష్ రావు పదేపదే చెబుతున్నారు. నిజంగానే వీళ్ళు ముస్లింలను అంత గొప్పగా చూసుకుంటుంటే మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకమయ్యారు ?

ఎందుకంటే ముస్లింల అభివృద్ధికి ఇచ్చిన హామీలను కేసీయార్ గడచిన పదేళ్ళుగా పూర్తిగా అమలుచేయలేదు కాబట్టే. మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం ఫెయిలైనట్లు ముస్లిం సంఘాలు మండిపోతున్నాయి. అలాగే తాజా ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు కూడా కేసీయార్ ఇవ్వలేదు. మిత్రపక్షం ఎంఐఎం తరపున ముస్లింలు పోటీచేస్తున్నపుడు మళ్ళీ ప్రత్యేకంగా బీఆర్ఎస్ తరపున ముస్లింలకు టికెట్లు ఇవ్వటం ఎందుకన్నట్లుగా కేసీయార్ వ్యవహారం ఉంది. అందుకనే ఎవరికీ టికెట్లివ్వలేదు. అలాగే మ్యానిఫెస్టోలో కొన్ని అంశాలను పెట్టి హామీలు ఇవ్వమని ముస్లిం పెద్దలడిగితే అవికూడా పెట్టలేదట.

ఇలాంటి అనేక కారణాల వల్ల ముస్లింల్లో కేసీయార్ ప్రభుత్వం అంటే తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ముస్లింల్లో కొందరికి టికెట్లిచ్చింది. అలాగే వాళ్ళడిగినట్లు కొన్ని అంశాలను మ్యానిఫెస్టోలో పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా డిక్లరేషన్ కూడా చేసింది. అందుకనే రెండుపార్టీల మధ్య తేడాను చూసుకున్న తర్వాత ముస్లింలో మెజారిటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతోంది. ముస్లింల నిర్ణయాలు చూసిన తర్వాత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ తో పాటు ఇమామ్, మౌల్వీలను బీఆర్ఎస్ రంగంలోకి దింపినా ఉపయోగం కనబడలేదని సమాచారం. వీళ్ళ నిర్ణయం అమల్లోకి వస్తేమాత్రం బీఆర్ఎస్ కు చాలా నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బలు తప్పవు.