బీజేపీకి ద‌గ్గ‌రై.. నేత‌ల‌కు దూర‌మై!

కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. మ‌రో జాతీయ పార్టీ బీజేపీకి చేరువ‌య్యారు. కాంగ్రెస్‌లో ఉన్న ప్ర‌భంజ‌నం ఉంటుంద‌ని ఆశించారు. అడిగిన విశాఖ సీటు ఇవ్వ‌క‌పోయినా.. స‌ర్దుకు పోయి.. ఇష్టం లేని రాజం పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచే 2019లో పోటీ చేశారు. త‌ర్వాత‌.. ఓట‌మి భారంతో కొన్నాళ్లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కీల‌క నేత‌ల నుంచి ఎలాంటి సానుభూతీ రాక‌పోయినా స‌ర్దుకుపోయారు. వేచి వేచి.. చివ‌ర‌కు అధిష్టానం మెప్పుపొందారు. కీల‌క‌మైన ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠాన్ని సొంతం చేసుకున్నారు.

ఆమే అన్న‌గారి గారాల ప‌ట్టి.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. ఏదీ ఊరికే రాదు.. అన్న‌ట్టుగా.. ఆమెకు బీజేపీ ఏపీ సీటు కూడా.. అంత తేలిక‌గా రాలేదు. ఎన్నో అవ‌మానాలు.. అసంతృప్తుల‌ను ఎదుర్కొన్న త‌ర్వాతే.. ఆమె కు ఈ సీటు ద‌క్కింది. ఇక‌, ఇప్పుడు దీనిని నిల‌బెట్టుకోవ‌డం మ‌రింత క‌త్తిమీద సాము మాదిరిగా మారింది. బీజేపీలో అధిష్టానానికి ద‌గ్గ‌రైనా.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్‌కు, నాయ‌కుల‌కు మాత్రం ఆమె ద‌గ్గ‌ర కాలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ముఖ్యంగా బీజేపీ విధానాల‌ను ఆమె ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌ని క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చెబుతున్నారు. మ‌ద్యం, ఇసుక వంటి అంశాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌జ‌ల సెంటిమెంటును త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఈ క్ర‌మంలో అధికార పార్టీ నేత‌ల నుంచి వ‌స్తున్న స‌వాళ్ల‌కు మాత్రం ఆమె దీటుగా జ‌వాబు చెప్ప‌లేక‌పోతున్నారు. దీంతో ఆమె చేస్తున్న ప్ర‌య‌త్నాలు కేవ‌లం ప్ర‌యాస‌గానే మారుతున్నాయ‌ని కీల‌క నాయ‌కులు చెబుతున్నారు.

నిజానికి గ‌త కొన్నాళ్లుగా.. వైసీపీ కీల‌క నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి పురందేశ్వ‌రిపై ఒంటికాలిపై లేస్తు న్నారు. ఆమెని నీతి లేని నాయ‌కురాలు అంటూ.. దుర్భాష‌లాడారు. కేరాఫ్ లేద‌న్నారు. టీడీపీ కోసం ప‌నిచేస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, ఇంత జ‌రుగుతున్నా.. పురందేశ్వ‌రిని వెనుకేసుకు వ‌చ్చిన మాట్లాడే కీల‌క నాయ‌కులు ఒక్క‌రు కూడా క‌నిపించ‌డం లేదు.

స‌త్య‌కుమార్‌, విష్ణుకుమార్ రాజు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, మాధ‌వ్‌, సోము వీర్రాజు వంటి వారు బ‌ల‌మైన గ‌ళం ఉన్న నాయ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ, వీరిలో ఏ ఒక్కరూ పురందేశ్వ‌రికి చేరువ కాలేదు. ఆమెకు మ‌ద్ద‌తుగా ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. మ‌రి దీనిని బ‌ట్టి.. పురందేశ్వ‌రి బీజేపీ కి చేరువైనా.. నాయ‌కుల‌కు మాత్రం చేరువ కాలేక‌పోయార‌నే వాద‌న‌లో నిజం లేదంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు.