కామ్రెడ్స్ ఒంట‌రి పోరు.. ఖ‌మ్మంలో ప్ర‌భావ‌మెంత‌?

అయితే కేసీఆర్‌తో కాదంటే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునేందుకు ఆది నుంచి ప్ర‌య‌త్నించిన క‌మ్యూనిస్టులకు చివ‌రి నిముషంలో ఇరు ప‌క్షాల నుంచి భంగ‌పాటే ఎద‌రైంది. అటు కేసీఆర్ ఉల‌క‌లేదు.. ప‌ల‌క‌లేదు. మునుగోడులో క‌మ్యూనిస్టులు స‌హ‌క‌రించిన నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ల‌సి వెళ్లాల‌ని అనుకున్నారు. అయితే.. కేసీఆర్ చివ‌ర‌కు హ్యాండిచ్చారు. ఇక‌, త‌ర్వాత అంకంలోకి కాంగ్రెస్ వ‌చ్చినా.. ఆ పార్టీ కూడా క‌మ్యూనిస్టుల‌తో పొత్తుల‌కు రెడీ కాలేదు. దీంతో ఇప్పుడు త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితిలో క‌మ్యూనిస్టులు ఒంట‌రి పోరుకు రెడీ అవుతున్నారు.

ఇందులోనూ సీపీఎం,సీపీఐలు ఎవ‌రికి వారుగా పోటీ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో సీపీఎం ఖమ్మం జిల్లాలో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. సత్తుపల్లి మినహా ఖమ్మం, వైరా, మధిర, పాలేరులో సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపేందుకు జిల్లా కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అభ్యర్థులతో పాటు నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కీల‌క‌మైన‌ పాలేరు నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధ‌ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే పాలేరులోని నాలుగు మండలాల్లో ఆయా మండల కమిటీల సమావేశాలు జరిగాయి. ఇక‌, పాలేరు, ఖమ్మం లాంటి ప్రతిష్టాత్మకమైన జనరల్‌ స్థానాల్లో సీపీఎం రాష్ట్ర స్థాయిలోని ముఖ్యనాయకులు పోటీ చేస్తే పార్టీకి పటిష్ఠమైన ఓటు బ్యాంకు ద‌క్కుతుంద‌ని కామ్రెడ్లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు స్థానాల‌కు కీల‌క నేత‌ల అన్వేష‌ణ సాగుతోంది. ఇక‌, సీపీఐ కూడా త‌న దారిలో తాను ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇల్లెందు, స‌త్తుప‌ల్లిలో సీపీఐ వంటరి పోరుకు రెడీ అవుతున్న‌ట్టు క‌మ్యూనిస్టులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మంలో క‌మ్యూనిస్టుల ప్ర‌భావం ఎంతనేది తేలిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఒక‌ప్పుడు బ‌ల‌మైన పార్టీలుగా ఉన్న క‌మ్యూనిస్టులు త‌ర్వాత త‌ర్వాత ప‌ల‌చ‌నబ‌డ్డార‌నే టాక్ ఉంది. ఇక‌, ఇత‌ర పార్టీల‌తో పొత్తుల‌కు ప్ర‌య‌త్నించి.. కేడ‌ర్‌లోనూ అస‌హ‌నం సృష్టించారు. దీంతో ఒంట‌రిపోరుతో ఏమేర‌కు ల‌బ్ధి పొందుతార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే.. ఈ ఒంట‌రి పోరు క‌మ్యూనిస్టుల‌కు మేలు చేసినా.. చేయ‌క‌పోయినా.. ప్ర‌ధాన‌పార్టీల ఓట్లు చీల్చ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.