ఆ దాడి నాపై జరిగినట్లే: కేసీఆర్

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రభాకర్ పై దాడిని కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని తన మీద దాడిగా పరిగణిస్తానని ఆయన అన్నారు. చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెధవలు ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచి దారుణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇది రాజకీయమా? ఇంత అరాచకమా? అని ప్రశ్నించారు.

వాస్తవానికి తాను ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాలనుకున్నానని, కానీ, హరీశ్ రావు, మిగిలిన మంత్రులు అక్కడే ఉన్నట్లు చెప్పడంతో సభకు వచ్చానని అన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రాణాపాయం లేదని, సభలను ముగించుకొని రావాలని తనకు సూచించారని చెప్పారు. బాగా పని చేసే నాయకులను ఎన్నికలలో ఎదుర్కొనే దమ్ములేని వారు కత్తులతో దాడులకు దిగారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారికి తెలంగాణ సమాజం తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఇలాంటి దాడులు ఆపకపోతే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాము ప్రజాసేవ గురించి ఆలోచిస్తున్నామని, మీరు దుర్మార్గమైన పనుల్లో ఉన్నారని విపక్షాలపై మండిపడ్డారు. పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ ఇలాంటి హింస జరగలేదని, తమ సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు, హరీష్ రావుకు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు.

కాగా, ఈ దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళిసై ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.