ఆ దమ్ముందా? సీఐడీకీ లోకేష్ సవాల్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి జైల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైళ్ల శాఖ డిఐజితో సజ్జల ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. జైల్లో డ్రోన్లు ఎగురుతున్న మాట వాస్తవమేనని, జైల్లో చంద్రబాబు ఫోటోలు బయటకు ఎలా వచ్చాయని లోకేష్ ప్రశ్నించారు. ఆ ఫోటోల లీక్ వ్యవహారానికి సంబంధించి హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు బరువు తగ్గారని, ఆయన ఆరోగ్యం గురించి చాలా ఆందోళనగా ఉందని అన్నారు. చంద్రబాబు పిటిషన్లపై వాయిదాలు అడుగుతున్నారని అన్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమాజానికి ఏం చేశాడని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతారని అన్నారు. దళితులను చంపిన వైసిపి నేతలను పక్కన కూర్చోబెట్టుకుంటున్న జగన్ సామాజిక బస్సు యాత్ర చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దమ్ముంటే సిఐడి, ప్రభుత్వం ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో వేశారని లోకేష్ ఆరోపించారు. బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి కూడా రోడ్డుపై తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ, ఏ తప్పు చేయని చంద్రబాబు 50 రోజులుగా జైల్లో ఉన్నారని, వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చనిపోవాలి చంద్రబాబును చంపేస్తామని వైసిపి నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తన తల్లి భువనేశ్వరిని కూడా జైలుకు పంపిస్తామని, అరెస్ట్ చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్ర చేస్తున్నారని అవినీతి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. జైలు అధికారుల ఒత్తిడితో క్యాటరాక్ట్ ఆపరేషన్ అర్జెంట్ కాదని నివేదిక ఇప్పించారని సంచలన ఆరోపణలు చేశారు.