‘కేసీఆర్ శవయాత్ర.. తెలంగాణ జైత్రయాత్ర.. అన్న‌ట్టు పోరాడాను’

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ప‌దే ప‌దే సీఎం కేసీఆర్ సెంటిమెంటుకే ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా ఖ‌మ్మంలో ప‌ర్య‌టించిన ఆయ‌న పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ప్ర‌జాఆశీర్వాద స‌భ‌లో ప్ర‌సంగించారు. తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో దారి తీసిన ప‌రిస్థితుల‌ను ఆయ‌న పూస గుచ్చిన‌ట్టు మ‌రోసారి వివ‌రించారు. తెలంగాణ ఏర్పాటు కోసం.. ఉద్యమ జెండాను ఆవిష్క‌రించి.. పిడికిడి మట్టి కోసం పోరాడానని చెప్పారు. 14 నుంచి 15 ఏళ్ళ‌పాటు నిరాటంకంగా జ‌రిగిన తెలంగాణ పోరాటం ఫ‌లించి భారత ప్రభుత్వం తలవంచి తెలంగాణ ఇచ్చిందన్నారు.

“కేసీఆర్ శవయాత్ర.. తెలంగాణ జైత్రయాత్ర నా అని పోరాడాను. నన్ను సిద్దిపేట నుంచి ఖమ్మం జైలుకి తీసుకుని వచ్చారు. అనేక మాట‌లు ప‌డ్డాను. అనేక మందితో తిట్టించుకున్నాను. అయినా.. రాష్ట్రం కోసం అన్నీ భ‌రించాను. ఇప్పుడు పోయి పోయి రాష్ట్రాన్ని కాంగ్రెస్ దొంగ‌ల చేతిలో పెడ‌తమా?!” అని కేసీఆర్ అన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళం ఉపేంద‌ర్‌రెడ్డి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌ల్లోనాలుక‌గా ఉన్నార‌ని కేసీఆర్ చెప్పారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

“పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఇంటి మనిషులుగా మాట్లాడాడు. సెల్ ఫోన్ నెంబరు ఉందా అని నియోజకవర్గంలోని ప్రజలను సొంతింటి వాడిలా అడిగి సమస్యలను తెలుసుకుంటున్నాడు” అని కేసీఆర్ కితాబు నిచ్చారు. గ‌తంలో పాలించిన కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ పాలేరు ప్రజలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పాలేరు నియోజకవర్గానికి నీళ్లు వచ్చాయని, పాలేరు చెరువులు ఒక్కప్పుడు ఎండిపోయాయ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

“నరం లేని నాలుకలు.. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశాం. భక్తరామదాసు ఎత్తుపోతల తర్వాత భూముల ధరలు ఎలా పెరిగాయో పాలేరు నియోజకవర్గ ప్రజలు ఆలోచింవాలి. అనేక మంది పదవుల కోసం పార్టీలు‌ మారుతారు. వారిని న‌మ్మొద్దు. కార్యకర్తలు మనతోనే ఉన్నారు” అని సీఎం కేసీఆర్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా బీఆర్ఎస్ విజ‌యం ద‌క్కించుకుని మూడోసారి కూడా అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు.