కేసీయార్ ను వెంటాడుతున్న రుణమాఫీ

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీయార్ను రుణమాఫీ పీడకలలాగ వెంటాడుతోంది. 2018 ఎన్నికల్లో గెలుపుకు రైతులకు రుణామాఫీ చేస్తానని కేసీయార్ హామీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత ఇంతకాలం చప్పుడు చేయలేదు. అలాంటిది నెలక్రితం సడెన్ గా రుణమాఫీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే. రుణమాఫీ జరగకపోతే రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే హడావుడి చేసి ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని నిధుల సేకరణ మొదలుపెట్టారు.

ప్రభుత్వం లెక్కల ప్రకారం రుణాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 40 లక్షలు. వీరిలో రు. 99,999 రుణమున్న వాళ్ళ సంఖ్య సుమారు 11 లక్షలు. లక్ష రూపాయలు రుణం ఉన్నవాళ్ళు మరో 20 లక్షలుంటారు. హోలుమొత్తం అనర్హులని తేల్చిన రైతుల సంఖ్య సుమారు 4 లక్షలు. మిగిలిన ఐదు లక్షల మంది రైతులు లక్ష రూపాయలకన్నా ఎక్కువ రుణం ఉన్న రైతులు. నానా అవస్తలు పడి రు. 99,999 అప్పున్న రైతులు 10 లక్షల మందికి మాఫీ జరిగిపోయింది.

మరి లక్ష రూపాయలు, అంతకుమించి అప్పున్న 25 లక్షల రైతుల మాటేమిటి ? అనే ప్రశ్న మొదలైంది. వాళ్ళ ఆప్పులు తీర్చటానికే కేసీయార్ ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. ఎక్కడెక్కడి నిధులు తీసుకొచ్చి ఇపుడు 25 లక్షల రైతుల అప్పులు తీర్చటానికే ప్రాధాన్యతిస్తున్నారు. మొత్తం అప్పును ఈనెలాఖరులోగా తీర్చేయాలన్నది కేసీయార్ టార్గెట్.

25 లక్షల మంది రైతుల అప్పులు తీరాలంటే ప్రభుత్వం రు. 13 వేల కోట్లు జమచేయాలి. ఇప్పటికి తీర్చింది సుమారు రు. 2 వేల కోట్లు మాత్రమే. ఇంకా 11 వేల కోట్ల రూపాయలను ఎలా సేకరించాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులను ఒకటే బాదుడు మొదలుపెట్టారు. మొత్తానికి నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేస్తే నిధులు లేకపోతే పరిస్ధితి ఎలాగుంటుందనేందుకు కేసీయార్ ప్రభుత్వమే ఉదాహరణ. తెలంగాణాయే కాదు ఏపీ, తమిళనాడు, కర్నాటక ఏ ప్రభుత్వం తీసుకున్నా ఇదే పరిస్ధితి. వీళ్ళిచ్చే ఉచిత హామీలు, రుణమాఫీ హామీలతో ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. ఈ పరిస్ధితి ఎప్పటికి మారుతుందో ఏమో.