కమిటి కంటితుడుపు మాత్రమే…జమిలి తథ్యమేనా

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి అనేక అంశాలపై అద్యయనంచేసి కేంద్రానికి రిపోర్టు ఇస్తుంది. రిపోర్టు ఇవ్వటంలో కేంద్రం డెడ్ లైన్ ఏమీ పెట్టలేదు. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింత్ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్ సభా నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, 15వ ఆర్ధికసంఘం ఛైర్మన్ ఎస్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, సుప్రింకోర్టు లాయర్ హరీష్ సాల్వే, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ సంజయ్ కొఠారీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటిలో ఉండేందుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ నిరాకరించారు. మరి ఈ స్ధానంలో కేంద్రం ఎవరిని వేస్తుందో చూడాలి. విషయం ఏమిటంటే కమిటిలో ఒక్కళ్ళంటే ఒక్కళు కూడా నరేంద్రమోడీ ఆలోచనలకు భిన్నంతా నడుచుకునే వాళ్ళు లేరు. మోడీ ఏమిచెబితే దానికి తలూపేవాళ్ళే. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు భిన్నంగా ఆలోచించినా మెజారిటి నిర్ణయం పేరుతో వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోరు.

మోడీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగా సిఫారసులు చేయటానికి ఒక కమిటీని నియమించిరాంతే. జమిలి ఎన్నికల నిర్వహణలో చాలా సమస్యలున్నాయి. అవన్నీ అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గతంలోనే ప్రతిపక్షాలతో మాట్లాడి, అనేకమంది అభిప్రాయాలను తీసుకున్నది కేంద్ర ఎన్నికల కమీషన్. అసలీ కమిటిలో 15వ ఆర్ధికసంఘం ఛైర్మన్ కు, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ కు, సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమీషనర్ కు చోటు కల్పించాల్సిన అవసరమే లేదు. కమిటిలో ఉండాల్సింది ప్రతిపక్ష నేతలు, కేంద్ర ఎన్నికల కమీషన్ లో పనిచేసిన చీఫ్ కమీషనర్ లేదా కమీషనర్లు.

ఉన్నత హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ముగ్గురిని కమిటిలో వేశారంటేనే కేంద్రం చిత్తశుద్ది ఏమిటో అర్ధమైపోతోంది. అందుకనే మోడీ ఫిక్సయిపోయారు కాబట్టి జమిలి ఎన్నికలు ఖాయమని అర్ధమైపోతోంది. కాకపోతే ఆ ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూడాల్సిందే.