మోత్కుపల్లి అనే లీడర్ ఉన్నారా?

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. గతంలో మంత్రిగానూ పని చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మొదలైన ఆయన ప్రస్థానం.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల గుండా సాగి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతోంది. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశంసిస్తూ ఆ నేత బీఆర్ఎస్లో చేరారు. కానీ కొన్ని రోజులు హడావుడి చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో మరోసారి యాక్టివ్ అయ్యారు. ఆయనే.. మోత్కుపల్లి నర్సింహులు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఈ బీఆర్ఎస్ నేత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆలేరు నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్సీ నేత మోత్కుపల్లి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓటమి తర్వాత పార్టీ వీడారు. 2018లో ఆలేరు నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ తరపున పోటీ చేసి ఓడారు. అనంతరం బీజేపీలోకి వెళ్లారు. 2021 అక్టోబర్లో బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు మోత్కుపల్లిని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందేమోనని ఆయన ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నారు.

ఆలేరు నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ మొండిచెయ్యి చూపించడంతో మోత్కుపల్లి ఇప్పుడు రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అనుచరులతో కలిసి యాదగిరి గుుట్టలో సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఈ సమావేశం తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మోత్కుపల్లి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.